న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో టీమ్ డేవిడ్ చాకచక్యంతో ఓడిపోయే మ్యాచ్లో ముంబై గెలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(47 బంతుల్లో 6 ఫోర్లతో 51), అక్షర్ పటేల్(24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా(3/22), జాసన్ బెహెండార్ఫ్(3/23) మూడేసి వికెట్లతో చెలరేగగా.. రిలే మెరిడిత్ రెండు వికెట్లు, హృతిక్ షోకీన్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(26 బంతుల్లో 6 ఫోర్లతో 31), తిలక్ వర్మ(29 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 41) విలువైన పరుగులు చేశారు. ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి ఐదు పరుగులు అవసరం కాగా.. అన్రిచ్ నోర్జ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
తొలి బంతికి సింగిల్ మాత్రమే ఇచ్చిన నోర్జ్.. రెండో బంతికి టీమ్ డేవిడ్ ఇచ్చిన క్యాచ్ను ముఖేశ్ కుమార్ నేలపాలు చేశాడు. మూడో బంతి డాట్ కాగా.. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. ఐదో బంతికి సింగిల్ రాగా.. గ్రీన్ రనౌట్ తప్పించుకున్నాడు. ఆఖరి బంతికి టీమ్ డేవిడ్ క్విక్ డబుల్ తీయగా.. డేవిడ్ వార్నర్ సరైన త్రో వేయకపోవడం ముంబై ఇండియన్స్కు కలిసొచ్చింది. మొత్తానికి హై థ్రిల్లింగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(26 బంతుల్లో 6 ఫోర్లతో 31) శుభారంభం అందించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ అనవసర పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకుంది. రోహిత్ అత్యుత్సాహంతో సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. ఇషాన్ కిషన్ బలయ్యాడు. ఇషాన్ వద్దని వారించినా.. రోహిత్ వినిపించుకోలేదు.
క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో రోహిత్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ధాటిగా ఆడే క్రమంలో తిలక్ వర్మ(41) క్యాచ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన సూర్య గోల్డెన్ డక్ అయ్యాడు. కుల్దీప్ బౌలింగ్లో తొలి బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఢిల్లీ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ స్టన్నింగ్ క్యాచ్కు రోహిత్ కూడా వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.కామెరూన్ గ్రీన్(17 నాటౌట్), టీమ్ డేవిడ్(13 నాటౌట్) మరో తప్పిదం చేయకుండా జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.