ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చిన్న మైదానం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఇది చాలా చిన్న మైదానం. చిన్న గ్రౌండ్లో సెకండ్ బ్యాటింగ్ చేయడమే ఉత్తమం. ప్రతీ మ్యాచ్ ఓ కొత్త గేమ్ లాంటిదే. మేం టోర్నీ రేసు నుంచి ఏ మాత్రం తప్పుకోం. ఆఖరి వరకు పోరాడుతాం. ప్రతీ మ్యాచ్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం. టీమ్ మూడ్ బాగుంది. టీమ్ ప్రణాళికల గురించి కూడా చర్చించాం.

జట్టులో అంతా బాగానే ఉంది. గతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎవర్నైనా ఓడించవచ్చు. మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. తుది జట్టులో ఒకే ఒక మార్పు చేశాం. గెరాల్డ్ కోయిట్జీకి విరేచనాలు అవుతున్నాయి. అతని స్థానంలో లూక్ వుడ్ జట్టులోకి వచ్చాడు.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.
టాస్ గెలిచినా తాము ముందు బ్యాటింగ్ చేసేవాళ్లమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. 'మేం బ్యాటింగ్ చేయాలనుకున్నాం. సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ నెమ్మదించే అవకాశం ఉంది. గత మ్యాచ్ విజయం అద్భుతం. జట్టుగా మేం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాం. ఇన్నింగ్స్ ఎలా కంట్రోల్ చేయాలనేదానిపై మేం చర్చించాం.
కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఒక్క ఓవరే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలదు. తుది జట్టులో ఒకే ఒక మార్పు చేశాం. పృథ్వీ షాను తప్పించి కుమార్ కుశాగ్రను తీసుకున్నాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, నెహల్ వధేరా, మహమ్మద్ నబీ, పియూష్ చావ్లా, లూక్ వుడ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా
ఢిల్లీ క్యాపిటల్స్:
కుమార్ కుషాగ్ర, జేక్ ఫ్రెజర్-మెక్గర్క్, షై హోప్, రిషభ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాడ్ విలియమ్స్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్