న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ పృథ్వీ షా(15) దారుణంగా విఫలమయ్యాడు. హృతిక్ షోకీన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. మూడు బౌండరీలతో టచ్లోకి వచ్చినట్లు కనిపించిన పృథ్వీ షా.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు.
ఈ సీజన్లో పృథ్వీ షా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. ఐపీఎల్ 2023 సీజన్ ముందు వరకు దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన పృథ్వీ షా.. అసలు టోర్నీలో మాత్రం తేలిపోతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో సత్తా చాటి మళ్లీ టీమిండియాకు ఆడాలనుకున్న అతని కల నెరవేరేలా లేదు.

ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 12 పరుగులే చేసిన పృథ్వీ షా.. గుజరాత్ టైటాన్స్తో 7, రాజస్థాన్ రాయల్స్తో డకౌటయ్యాడు. మూడు మ్యాచ్ల్లో విఫలమైనా.. పృథ్వీ షాకు ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశమిస్తూ అండగా నిలుస్తోంది. అతను మాత్రం ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. పేలవ బ్యాటింగ్తో జట్టుగా భారంగా మారాడు.
వరుస వైఫల్యాల నేపథ్యంలో పృథ్వీ షాపై అభిమానులు మండిపడుతున్నారు. పృథ్వీ షా.. ఇక నుంచి పుట్నాలే అమ్ముకోవాలని, పేలవ ఫామ్తో ఐపీఎల్కు కూడా దూరమవుతాడని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు భోజ్పురి నటి సప్నా గిల్ ఉసురు ముట్టిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఆ అమ్మాయి తాంత్రిక పూజలతో పృథ్వీ షా ఆడకుండా చేస్తుందని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
తనను సెలెక్టర్లు పట్టించుకోనప్పుడల్లా సాయి బాబా అంటూ విమర్శలు గుప్పించిన పృథ్వీ షాకు అభిమానులు అదే రితీలో ట్రోల్ చేస్తున్నారు. 'నేను చూస్తున్నా బేటా.. నువ్వే ఆడటం లేదు. నేనేం చేయాలి'అని సాయి బాబానే పృథ్వీ షాను అడుగుతున్నట్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే షా ఔటవ్వగా.. మనీశ్ పాండే(26)తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
క్రీజులో సెట్ అయిన ఈ జోడీని పియూష్ చావ్లా విడదీసాడు. ఆ తర్వాత వచ్చిన యశ్ ధూల్(2), రోవ్మన్ పోవెల్(4), లలిత్ యాదవ్(2) దారుణంగా విఫలమవ్వడంతో 98 పరుగులకే ఢిల్లీ ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.