న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య ప్రారంభం కావాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం 7.30 గంటలకే ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఎడ తెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.
దాంతో ఇంకా టాస్ కూడా వేయలేదు. వర్షం బ్రేక్ ఇస్తే మైదాన పరిస్థితులు ఆటకు అనుకూలంగా ఉంటే ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. గత రెండు రోజులుగా ఉత్తర భారత దేశంలో వర్షాలు కురుస్తున్నాయి.

ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని ఢిల్లీ క్యాపిటల్స్.. కేకేఆర్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమైంది. సొంతమైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో గెలిచి టోర్నీ బోణీ చేయాలనే పట్టుదలతో ఉంది.
మరోవైపు కేకేఆర్ తను ఆడిన ఐదు మ్యాచుల్లో రెండింట విజయం సాధించింది. అయితే ఈ జట్టు పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదు. గెలిచిన రెండు మ్యాచులూ కూడా ఇద్దరు ఆటగాళ్ల వల్ల గెలిచినవే. ఒక జట్టుగా కేకేఆర్ పెద్దగా రాణించడం లేదు. ఆర్సీబీపై శార్దూల్ ఠాకూర్ వల్ల గెలిస్తే.. గుజరాత్ టైటాన్స్పై రింకూ సింగ్ హీరోయిక్ ఇన్నింగ్స్ వల్ల గెలిచింది. ఢిల్లీపై ఇలా గెలవడం కేకేఆర్కు కష్టమే. ఎందుకంటే ఆ జట్టు బౌలింగ్ ఎటాక్ చాలా బాగుంది. మిచెల్ మార్ష్, ముఖేష్ కుమార్, ముస్తాఫిజుర్ వంటి బౌలర్లు ఢిల్లీ సొంతం. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో మంచి స్పిన్నర్లు కూడా ఉన్నారు.
కాబట్టి ఎవరో ఒకరిపై ఆధారపడి ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలవాలి అనుకుంటే అది అసాధ్యమే అని చెప్పాలి. దానికితోడు కేకేఆర్ బౌలింగ్ పెద్ద బలంగా లేదు. ఉమేష్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్, ఆండ్రీ రస్సెల్ ఎవరూ కూడా బంతితో పెద్దగా రాణించడం లేదు. కేవలం సూయష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ మీదనే ఆ జట్టు బౌలింగ్ భారం పడుతోంది. ఈ విషయంలో ఢిల్లీ కొంచెం తడబడుతుందనే చెప్పాలి.
ఢిల్లీ బ్యాటింగ్ చాలా పేలవంగా ఉంది. వార్నర్, పృథ్వీ షా ఇద్దరూ పెద్దగా ఆడటం లేదు. వార్నర్ అయితే మరీ జిడ్డుగా ఆడుతూ తలనొప్పి తెప్పిస్తున్నాడు. మిడిలార్డర్లో కూడా నిలకడగా ఆడటం వారి వల్ల కావడం లేదు. అక్షర్ పటేల్ను ప్రమోట్ చేసి కొంచెం ముందు పంపేందుకు డీసీ ససేమిరా అంటోంది. ఇది కూడా ఆ జట్టు విజయాలపై ప్రభావం చూపించే అంశమే.