
షార్జా: శ్రేయస్ అయ్యర్(38 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 88 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి తోడు పృథ్వీ షా(41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 66), రిషభ్ పంత్(17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 38) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్.. ప్రత్యర్ధి ముందు 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
చిన్నమైదానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతీ బ్యాట్స్మెన్ బౌండరీలతో చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 రన్స్ చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో అండ్రూ రస్సెల్ రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, నాగర్ కోటికి తలో వికెట్ దక్కింది.
ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్(26) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యం అందించిన అనంతరం ధావన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన అయ్యర్తో షా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఓవర్కు రెండేసి బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు.
ఈ క్రమంలో షా 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ సీజన్లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన షా.. నాగర్ కోటి బౌలింగ్లో ఓ భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(38)తో అయ్యర్ ధాటిగా ఆడాడు.
26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవైపు అయ్యర్.. మరోవైపు పంత్ బౌలర్లపై విరుచుకుపడటంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. రసెల్ వేసిన 18 ఓవర్లో 6,4,4తో చెలరేగిన పంత్.. ఆ మరుసటి బంతికి కూడా భారీ షాట్ ఆడి లాంగాన్లో శివమ్ మావికి చిక్కాడు.
19వ ఓవర్లో అయ్యర్, రెండు సిక్సర్లు ఒక ఫోర్తో విరుచుకుపడటంతో 20 రన్స్ వచ్చాయి. రస్సెల్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి స్టోయినిస్ ఔటవ్వగా.. హెట్మైర్ భారీ సిక్సర్ కొట్టాడు. అనంతరం రెండు బంతులను డాట్ చేసిన రస్సెల్.. ఆఖరి బంతికి సింగిలే రావడంతో ఈ ఓవర్లో 7 పరుగులే వచ్చాయి.