
షార్జా: ఐపీఎల్ 2021 సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్రకు కోల్కతా నైట్రైడర్స్ బ్రేక్ వేసింది. డబుల్ హెడర్లో భాగంగా మంగళవారం జరిగిన ఫస్ట్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన కోల్కతా నైట్రైడర్స్.. 3 వికెట్లతో ఢిల్లీపై గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో నాలుగో ప్లేస్కు దూసుకెళ్లిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్(34 బంతుల్లో 4 ఫోర్లతో 39), రిషభ్ పంత్(36 బంతుల్లో 3 ఫోర్లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(2/18), వెంకటేశ్ అయ్యర్(2/29), లూకీ ఫెర్గూసన్(2/10) రెండేసి వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ తీశాడు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ ఇన్నింగ్స్లో ముగ్గురు డకౌట్లుగా వెనుదిరిగారు. షార్జా అంటే సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఈ ఇన్నింగ్స్లో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 18.2 ఓవర్లలో 7 వికెట్లకు 130 పరుగులు చేసి 10 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. నితీశ్ రాణా(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్), శుభ్మన్ గిల్(33 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 30) రాణించారు. చివర్లో సునీల్ నరైన్(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 21) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/13) మూడు వికెట్లు తీయగా.. అన్రిచ్ నోర్జ్, రవిచంద్రన్ అశ్విన్, లలిత్ యాదవ్, కగిసో రబడా చెరొక వికెట్ దక్కించుకున్నారు.
128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్కు శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(14).. లలిత్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయి నిరాశపరిచాడు. ఆ మరుసటి ఓవర్లోనే సిక్సర్తో జోరు కనబర్చిన రాహుల్ త్రిపాఠి(9)ని అవేశ్ ఖాన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 44 రన్స్ మాత్రమే చేసింది. ఆ తర్వాత పంత్.. అశ్విన్ను రంగంలోకి దింపగా.. శుభ్మన్ గిల్ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత అక్షర్ కొంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోర్ వేగం మందగించింది. ఇక రబడా వేసిన 11వ ఓవర్లో గిల్(30) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఇయాన్ మోర్గాన్ను అశ్విన్ డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. పంత్తో కలిసి పర్ఫెక్ట్ ప్లాన్ రచించి మోర్గాన్పై రివేంజ్ తీసుకున్నాడు. దాంతో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ బౌండరీతో జోరు కనబర్చాడు.
ఇక లలిత్ యాదవ్ వేసిన 14వ ఓవర్లో నితీశ్ రాణా వరుస సిక్స్లతో చెలరేగాడు. రెండు సిక్స్లతో పాటు ఓ బౌండరీ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్లోనే కార్తీక్ను ఆవేశ్ ఖాన్ ఔట్ చేయడంతో ఢిల్లీ మ్యాచ్పై మళ్లీ పట్టుబిగించినట్లు అయింది. అయితే రబడా వేసిన 16వ ఓవర్లో నరైన్ 6, 4, 4తో విశ్వరూపం చూపించడంతో 21 పరుగులు వచ్చాయి. దాంతో మ్యాచ్ మొత్తం కేకేఆర్వైపు మళ్లింది. చివరి నాలుగు ఓవర్లలో కేకేఆర్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. అన్రిచ్ నోర్జ్ బౌలింగ్లో నరైన్(21), అవేశ్ ఖాన్ బౌలింగ్లో టీమ్ సౌథీ ఔటైనా.. నితీశ్ రాణాతో బౌండరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.