
అహ్మదాబాద్: బర్త్డే బాయ్ ఆండ్రీ రస్సెల్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 45 నాటౌట్) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు కోల్కతా నైట్రైడర్స్ 155 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. రస్సెల్కు ముందు ఓపెనర్ శుభ్మన్ గిల్ రాణించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసింది.
మరోసారి కేకేఆర్ టాప్ బ్యాట్స్మెన్ తడబడటంతో ఓదశలో కనీసం 130 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ రస్సెల్ ధాటికి చివరి మూడు ఓవర్లలో 42 రన్స్ రావడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్, స్టోయినిస్ చెరొక వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్కు శుభారంభం దక్కలేదు. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఓపెనర్ నితీష్ రాణా(14) స్టంపౌట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి రాహుల్ త్రిపాఠి రాగా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ బౌండరీలు బాదడంతో కేకేఆర్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 45 రన్స్ చేసింది. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని మార్కస్ స్టోయినిస్ విడదీసాడు. రాహుల్ త్రిపాఠి(19) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(0) లలిత్ యాదవ్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే జోరు మీదున్న శుభ్మన్ గిల్(43) సైతం అవేశ్ ఖాన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో కేకేఆర్ 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట స్థితిలో జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్(14), రస్సెల్ ఇన్నింగ్స్ను ముందుకు తీసే ప్రయత్నం చేశాడు. కానీ కార్తీక్ను అక్షర్ పటేల్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన కమిన్స్తో కలిసి రస్సెల్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.
అవేశ్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో 11 రన్స్ రాగా.. రబడా వేసిన 19వ ఓవర్లో రస్సెల్ 2 సిక్స్లు, ఓ ఫోర్ కొట్టడంతో 18 రన్స్ వచ్చాయి. చివరి ఓవర్లో అవేశ్ ఖాన్ కట్టుదిట్టంగా వేసినా.. రస్సెల్ చివరి బంతికి సిక్స్ కొట్టి 13 రన్స్ పిండుకున్నాడు. దాంతో కేకేఆర్ 154 పరుగులు చేసింది.