
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ పరాజయాల పరంపరకు ఎట్టకేలకు ముగింపు పలికింది. వరుసగా ఐదు ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. కోల్కతా నైట్రైడర్స్తో గురువారం జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, అక్షర్ పటేల్ సత్తా చాటగా.. బ్యాటింగ్లో డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్తోనే కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన జాసన్ రాయ్(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 43) ఒక్కడే రాణించగా.. చివర్లో ఆండ్రీ రస్సెల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 38 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ(2/19), అన్రిచ్ నోర్జ్(2/15), అక్షర్ పటేల్(2/13), కుల్దీప్ యాదవ్(2/15) రెండేసి వికెట్లు తీయగా.. ముఖేశ్ కుమార్(1/34) ఓ వికెట్ తీసాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు చేసి గెలుపొందింది. డేవిడ్ వార్నర్(41 బంతుల్లో 11 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. మనీశ్ పాండే(21), అక్షర్ పటేల్(19 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు.
కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, అనుకుల్ రాయ్, నితీశ్ రాణా తలో రెండు వికెట్లు తీసారు. కేకేఆర్ వికెట్ కీపర్ లిటన్ దాస్ చేసిన తప్పిదాలు ఆ జట్టు ఓటమిని శాసించింది. మూడు స్టంపింగ్ ఔట్ అవకాశాలను లిటన్ దాస్ చేజార్చాడు.
128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ను ఓపెనర్ల పృథ్వీ షా(13), డేవిడ్ వార్నర్ ధాటిగా ప్రారంభించారు. ఇద్దరు బౌండరీలతో విరుచుకుపడ్డారు. పృథ్వీ షాను వరుణ్ చక్రవర్తీ బౌల్డ్ చేసినా.. వార్నర్ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.
డేంజరస్ మిచెల్ మార్ష్(2)ను నితీశ్ రాణా ఔట్ చేయగా.. ఫిట్ సాల్ట్(5)ను అనుకుల్ రాయ్ రిటర్న్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి మనీశ్ పాండే రాగా.. వార్నర్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ను వరుణ్ చక్రవర్తీ వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ రాగా.., మనీశ్ పాండే(21) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అనుకూల్ రాయ్ బౌలింగ్లో ఔటయ్యాడు.
క్రీజులోకి వచ్చిన అమన్ ఖాన్(0)ను నితీశ్ రాణా క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. వరుణ్ చక్రవర్తీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ విజయానికి చివరి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి.
నితీశ్ రాణా వేసిన 19వ ఓవర్లో ఐదు పరుగులే ఇవ్వడంతో ఢిల్లీ విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. కుల్వంత్ కెజ్రోలియా వేసిన చివరి ఓవర్లో మూడు క్విక్ డబుల్స్ తీసిన అక్షర్ ఢిల్లీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.