న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆ జట్టు విజయాన్నందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన గుజారత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది. డేవిడ్ వార్నర్(32 బంతుల్లో 7 ఫోర్లతో 37), అక్షర్ పటేల్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ఇతర బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రషీద్ ఖాన్(3/31), మహమ్మద్ షమీ(3/41) మూడేసి వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించగా... అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలోనే 163 పరుగులు చేసి 11 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సాయి సుదర్శన్(48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 62 నాటౌట్), డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 31 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ 2 వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీసారు.
163 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా(14), శుభ్మన్ గిల్(14)లను అన్రిచ్ నోర్జ్ వరుస ఓవర్లలో క్లీన్ బౌల్డ్ చేయగా.. హార్దిక్ పాండ్యా(5)ను ఖలీల్ అహ్మద్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో గుజరాత్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో విజయ్ శంకర్(20, సాయి సుదర్శన్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 43 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మిచెల్ మార్ష్ విడదీసాడు.
క్రీజులోకి డేవిడ్ మిల్లర్ రాగా.. సాయి సుదర్శన్ అన్రిచ్ నోర్జ్ బౌలింగ్లో బౌండరీ బాది 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఎల్బీగా ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. మిల్లర్ రివ్యూతో గట్టెక్కాడు. అనంతరం తనదైశైలిలో బౌండరీలు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.