న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ హాజరయ్యాడు. ఘోర రోడ్డు ప్రమాదంతో ఈ సీజన్ మొత్తానికి దూరమైన పంత్.. ఢిల్లీ ఫ్రాంచైజీ విజ్ఞప్తి మేరకు మ్యాచ్కు హాజరై జట్టుకు మద్దతు తెలిపాడు. పంత్ మొకాలికి శస్త్రచికిత్స జరగ్గా.. బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో అతను కోలుకుంటున్నాడు.
బోర్డు అనుమతితో ఢిల్లీ వేదికగా జరుగుతున్న తమ జట్టు మ్యాచ్కు హాజరయ్యాడు. స్నేహితులతో కలిసి మైదానానికి కారులో వచ్చిన పంత్కు ఢిల్లీ ఫ్రాంచైజీ అధికారులతో పాటు బీసీసీఐ పెద్దలు స్వాగతం పలికారు. వైట్ టీషర్ట్, షార్ట్స్ ధరించిన పంత్.. గాగుల్స్తో బాలీవుడ్ హీరోను తలపించాడు.
ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సైతం పంత్కు స్వాగత పలికాడు. ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్లోకి పంత్ వస్తాడని అంతా భావించినా అతను స్టాండ్స్కే పరిమితమయ్యాడు.

మ్యాచ్కు హాజరైన ప్రేక్షకులు మాత్రం రిషభ్ పంత్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. భారీ 18 నెంబర్ జెర్సీని ప్రదర్శించిన అభిమానులు.. వి మిస్ యూ పంత్ అనే ప్లకార్డును ప్రదర్శించారు. పంత్.. స్టాండ్స్ నుంచే అభిమానులకు అభివాదం చేశాడు. తొలి మ్యాచ్లో పంత్ జెర్సీ నెంబర్ 17ను డగౌట్పై వేలాడదీసిన ఢిల్లీ టీమ్.. అతనికి సంఘీభావం తెలిపింది. గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ పృథ్వీ షా(7) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. మహమ్మద్ షమీ బౌలింగ్లో షా క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇక షమీ మరుసటి ఓవర్లోనే మిచెల్ మార్ష్(4) కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరస్థితుల్లో సర్ఫరాజ్ ఖాన్తో కలిసి వార్నర్ ధాటిగా ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.
వరుస బంతుల్లో క్రీజులో సెట్ అయిన డేవిడ్ వార్నర్(37), రిలీ రోసౌ(0)ను ఔట్ చేసిన అల్జారీ జోసెఫ్ కోలుకోలేని దెబ్బతీసాడు. ఈ పరిస్థితుల్లో అభిషేక్ పోరెల్ భారీ సిక్సర్లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ రషీద్ ఖాన్ అతన్ని బౌల్డ్ చేయడంతో ఢిల్లీ 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.