ఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ ఎలా ఉంటుందో తమకు తెలియదని, డ్యూ ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా అన్నాడు. తీవ్ర గాయం కారణంగా కేన్ విలియమ్సన్ సేవలను కోల్పోవడం దురదృష్టకరమని తెలిపాడు. అతను గాయపడటం తమను బాధించిందన్నాడు.
అయితే కేన్ విలియమ్సన్ లేని లోటును తాము భర్తీ చేయగలమని చెప్పాడు. అతని సేవలను కోల్పోవడం వల్ల జట్టుకు వచ్చే నష్టం ఏం లేదని తెలిపాడు. కేన్ విలియమ్సన్ స్థానంలో డేవిడ్ మిల్లర్ జట్టులోకి వచ్చాడని చెప్పిన హార్దిక్ పాండ్యా.. విజయ్ శంకర్ స్థానంలో సాయి సుదర్శన్ను తీసుకున్నామని పేర్కొన్నాడు. జట్టులో పెద్దగా చర్చ చేసిందేం లేదని, ప్రశాంతంగా ఉంటూ.. ఆటపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు.

పిచ్ చాలా బాగుందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతామని చెప్పాడు. సొంతగడ్డపై ఆడటం ఎప్పటికీ అడ్వాంటేజ్ అని చెప్పిన వార్నర్.. ఈ రాత్రిని తమకు అనుకూలంగా మలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. అన్రిచ్ నోర్జ్, పొరెల్ జట్టులోకి వచ్చారని తెలిపిన వార్నర్.. టీమ్ కాంబినేషన్లో భాగంగా రోవ్మన్ పోవెల్ను పక్కనపెట్టినట్లు వివరించాడు. సుదీర్ఘ టోర్నీలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పదన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్తో తొలి మ్యాచ్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ జోరు మీద ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్తో జరిగే తాజా మ్యాచ్లో విజయం సాధించి బోణీ కొట్టాలని ఢిల్లీ భావిస్తోంది.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్(కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్(కీపర్), అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, ఆమన్ హకీమ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్, ముఖేశ్ కుమార్
గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా(కీపర్), శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జోషువా లిటిల్, యష్ దయాల్, అల్జారీ జోసెఫ్