ఐపీఎల్ 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో సంచలన విజయాన్నందుకుంది. గుజరాత్ టైటాన్స్తో బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్లో రిషభ్ పంత్ విధ్వంసం.. ముఖేష్ కుమార్ కట్టుదిట్టమైన బౌలింగ్ ఢిల్లీని విజేతగా నిలబెట్టింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసింది. రిషభ్ పంత్(43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 88 నాటౌట్), అక్షర్ పటేల్(43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 66) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. ట్రిస్టన్ స్టబ్స్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సందీప్ వారియర్ మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసి ఓటమిపాలైంది. సాయి సదర్శన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 65), డేవిడ్ మిల్లర్(23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 55) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఢిల్లీ బౌలర్లలో రసిఖ్ సలామ్(3/44) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్, ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
శుభ్గిల్ విఫలం..
225 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అన్రిచ్ నోకియా వేసిన రెండో ఓవర్లోనే కెప్టెన్ శుభ్మన్ గిల్(6) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన సాయి సుదర్శన్తో కలిసి సాహా చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో గుజరాత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.
అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ పోటాపడి బౌండరీలు బాదింది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. వృద్దిమాన్ సాహా(39)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్(1)ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. సాయి సుదర్శన్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మిల్లర్ విధ్వంసం..
క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ విధ్వంసకర బ్యాటింగ్తో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్ను రసీఖ్ సలామ్ ఔట్ చేయగా.. షారుఖ్ ఖాన్(8), రాహుల్ తెవాటియా(4) నిరాశపరిచారు. దూకుడుగా ఆడిన డేవిడ్ మిల్లర్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని ముఖేష్ కుమార్ ఔట్ చేయగా.. సాయి కిషోర్(13) 2 భారీ సిక్స్లు బాదాడు.
కానీ అతన్ని రసిఖ్ సలామ్ ఔట్ చేయడంతో.. ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ముఖేష్ కుమార్ బౌలింగ్లో రషీద్ ఖాన్ వరుసగా రెండు బౌండరీలు, ఓ సిక్స్ బాది ఆశలు రేకెత్తించాడు. కానీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముఖేష్ కుమార్ ఢిల్లీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.