న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు దుమ్మురేపారు. రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 79), డేవాన్ కాన్వే( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 87 )విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది.
శివమ్ దూబే(9 బంతుల్లో 3 సిక్స్లతో 22), రవీంద్ర జడేజా(7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త టైమ్ తీసుకున్న ఈ జోడీ.. ఆ తర్వాత చూడ చక్కటి బౌండరీలతో పరుగులు రాబట్టింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది.

అనంతరం ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పిన్నర్లను బరిలోకి దించినా ఈ జోడీ బెదరలేదు. క్విక్ సింగిల్స్, డబుల్స్తో స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. అక్షర్ పటేల్ వేసిన 10 ఓవర్లో గైక్వాడ్ వరుసగా రెండు సిక్స్లు బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో గైక్వాడ్కు ఇది మూడో అర్థ శతకం.
ఇక కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో గైక్వాడ్ హ్యాట్రిక్ సిక్స్లు బాది జోరు కనబర్చాడు. అన్రిచ్ నోర్జ్ బౌలింగ్లో గైక్వాడ్ మరో సిక్స్ బాదగా.. ఖలీల్ అహ్మద్ ఓవర్లో సిక్స్ బాదిన కాన్వే 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేంజరస్గా మారిన రుతురాజ్ గైక్వాడ్ను చేతన్ సకారియా ఔట్ చేయడంతో తొలి వికెట్కు నమోదైన 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే భారీ సిక్సర్తో తన ఆటను ప్రారంభించాడు. కాన్వే సైతం దూకుడుగా ఆడటంతో చెన్నై స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్లో శివమ్ దూబే రెండు సిక్స్లు బాది క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి ధోనీ రాగా.. అన్రిచ్ నోర్జ్ వేసిన 19వ ఓవర్లో కాన్వే ఔటయ్యాడు. జడేజా వరుసగా 6, 4 బాది జట్టు స్కోర్ 200 మార్క్ ధాటించాడు.
సకారియా వేసిన చివరి ఓవర్లో జడేజా రెండు బౌండరీలు బాదగా..ధోనీ సింగిల్తో ఇన్నింగ్స్ను ముగించాడు.