న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్మురేపింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 79), డేవాన్ కాన్వే( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 87 )విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది.
శివమ్ దూబే(9 బంతుల్లో 3 సిక్స్లతో 22), రవీంద్ర జడేజా(7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు.

ఓపెనర్లే 141 పరుగుల భాగస్వామ్యం అందించడంతో ఏడో స్థానంలో రావాల్సిన ధోనీ మూడో స్థానంలో బరిలోకి దిగాడు. డెవాన్ కాన్వే ఔటైన వెంటనే లెఫ్టాండర్ రవీంద్ర జడేజాను బ్యాటింగ్కు పంపించాలని చెన్నై కోచ్కు ధోనీ సూచించాడు. కాన్వే ఔటైన వెంటనే డగౌట్ వైపు చూస్తూ లెఫ్టాండర్ బ్యాటర్ అయిన జడేజాను పంపించాలని సైగ చేశాడు.
దాంతో మొయిన్ అలీ, అజింక్యా రహానేలను కాదని చెన్నై మేనేజ్మెంట్ జడేజాను పంపించింది. ఇక రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నంతసేపు అభిమానులు సింగిల్ తీయాలని పట్టుబట్టారు. నాన్స్ట్రైకర్లో ధోనీకి బ్యాటింగ్ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఇక లెఫ్టాండర్ అయిన జడేజాను పంపించాలంటూ ధోనీ చేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. జట్టు అదనంగా 20 పరుగులు చేయడంతో జడేజా ఉపయోగపడ్డాడు. అయితే ధోనీనే అభిమానులను నిరాశపరిచాడు. మొత్తం 4 బంతులు ఆడి ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. ప్రతీ మ్యాచ్లో బ్యాటింగ్కు వచ్చినప్పుడల్లా ధాటిగా ఆడిన ధోనీ ఈ మ్యాచ్లో భారీ షాట్లు కొట్టకపోవడం అభిమానులను నిరాశపరిచింది.
లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ 26 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా(5), ఫిల్ సాల్ట్(3), రిలీ రోసౌ(0)లను దేశ్పాండే, దీపక్ చాహర్లు ఔట్ చేశారు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే చెన్నై ప్లే ఆఫ్స్కు చేరడంతో పాటు క్వాలిఫయర్-1కు క్వాలిఫై అవుతోంది.