ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో వైజాగ్ వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. డేవిడ్ వార్నర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 52), రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది.
ఈ ఇద్దరితో పాటు పృథ్వీ షా(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 43) మెరుపులు మెరిపించాడు. చెన్నై బౌలర్లలో మతీష పతీరణ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. రీఎంట్రీ తర్వాత తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన రిషభ్ పంత్..ఈ మ్యాచ్లో తన అసలు సిసలు ఆటను చూపించాడు.

దుమ్మురేపిన షా, వార్నర్..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దూకుడైన బ్యాటింగ్తో బౌండరీల మోత మోగించారు. దాంతో పవర్ ప్లేలోనే ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. జడేజా బౌలింగ్లో సిక్సర్ బాదిన డేవిడ్ వార్నర్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ముస్తాఫిజుర్ వేసిన మరుసటి ఓవర్లో మతీష పతీరణ స్టన్నింగ్ క్యాచ్కు వార్నర్ పెవిలియన్ చేరాడు. ఈ ఓవర్ తొలి బంతికే అతను ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను ముస్తాఫిజుర్ అందుకోలేకపోయాడు. కానీ ఈ అవకాశాన్ని వార్నర్ అందిపుచ్చుకోలేకపోయాడు. జడేజా వేసిన మరుసటి ఓవర్లోనే భారీ సిక్సర్ బాది హాఫ్ సెంచరీకి చేరువైన పృథ్వీ షా.. అదే జోరులో తర్వాతి బంతికే కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
ధోనీ@300..
ఈ క్యాచ్తో ధోనీ వికెట్ కీపర్గా టీ20ల్లో 300 ఔట్లలో భాగమైన వికెట్ కీపర్గా చరిత్రకెక్కాడు. క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్(18), ట్రిస్టన్ స్టబ్స్(0)లను వరుస బంతుల్లో పతీరణ పెవిలియన్ చేర్చాడు. అక్షర్ పటేల్తో కలిసి పంత్ దూకుడుగా ఆడాడు. పతీరణ వేసిన 19వ ఓవర్లో 6, 4, 4 బాది 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ వెంటనే మరో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. చివరి ఓవర్లో 10 పరుగులు రావడంతో ఢిల్లీ 190 పరుగుల మార్క్ ధాటింది.