మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్తోనే ఓడిపోయే మ్యాచ్లో విజయం సాధించామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. అద్భుతమైన యార్కర్లతో మిచెల్ స్టార్క్ తమకు విజయాన్ని అందించాడని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో బుధవారం సూపర్ ఓవర్కు దారి తీసిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన అక్షర్ పటేల్.. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో గెలవడం సంతోషంగా ఉందని చెప్పాడు.
పిచ్ కఠినంగా ఉంది..
'అంతా బాగుంది. ముగింపు అదిరింది. మాకు దక్కిన ఆరంభం.. పవర్ ప్లేలో మేం ధారళంగా పరుగులివ్వడంతో.. మేం కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సిందని నేను భావించా. కానీ టైమ్ ఔట్లో కేఎల్ రాహుల్, పోరెల్.. పిచ్ బ్యాటింగ్కు కఠినంగా ఉందని చెప్పారు. 12, 13వ ఓవర్లో మాకు మూమెంటమ్ లభించింది. చివరికి మేం మంచి లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచాం. వికెట్ కాస్త స్టిక్కీగా ఉంది. కొత్త బ్యాటర్లకు వేగంగా పరుగులు చేయడం కష్టమైంది.

మా వాళ్లకి ఒక్కటే చెప్పా..
రాజస్థాన్ పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసింది. దాంతో మాలో కాస్త ఆందోళన నెలకొంది. మేం వెంటనే టైమ్ ఔట్ తీసుకున్నాం. మా వాళ్లకు ఒక్కటే చెప్పా. ఈ లక్ష్యాన్ని చేధించడం వారికి అంత సులువు కాదు. బౌండరీలు కొట్టడం చాలా కష్టం. కాబట్టి మనం మనమీద నమ్మకం ఉంచి వికెట్ తీసే ప్రయత్నం చేయాలి. నేను చెప్పినట్లుగానే సెట్ బ్యాటర్లు ఔటైన తర్వాత మాకు కొన్ని వికెట్లు దక్కాయి. కొత్త బ్యాటర్లు కంగారు పడ్డారు. వేగంగా పరుగులు చేయాలనే ఆలోచనతో మూల్యం చెల్లించుకున్నారు.
12 యార్కర్లు..
ఈ ఏడాది నేను పెద్దగా రాణించలేదు. కానీ జట్టు విజయాలు సాధిస్తుండటంతో నా ఆత్మవిశ్వాసం సన్నగిల్ల లేదు. కానీ నేను నాయకుడిగా జట్టు విజయాల్లో భాగం కావాలని భావించాను. నేను నా విధానంపై ఫోకస్ పెట్టాను. దాంతో ఈ రోజు బ్యాటింగ్, బౌలింగ్లో రాణించగలిగాను. ఫైనల్ ఓవర్లో స్టార్క్ మాత్రమే రాణించగలడని నేను నమ్మాను. అతనే మమ్మల్ని గేమ్లోకి తీసుకొచ్చాడు. అతను 20వ ఓవర్తో పాటు సూపర్ ఓవర్ బౌలింగ్ చేశాడు. 12 బంతులకు 12 యార్కర్లు వేసాడు. అందుకే అతను ఆస్ట్రేలియా లెజెండ్ అయ్యాడు. గత మ్యాచ్ ఓడిపోవడం మాకు కలిసొచ్చింది.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
మలుపు తిప్పిన స్టార్క్..
18వ ఓవర్లో క్రీజులో సెట్ అయిన నితీష్ రాణాను ఔట్ చేసి మిచెల్ స్టార్క్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఈ ఓవర్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చిన అతను ఆఖరి ఓవర్లో 9 పరుగులు ఇవ్వకుండా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కచ్చితమైన యార్కర్లతో మ్యాచ్ను టైగా మార్చాడు. సూపర్ ఓవర్లోనూ యార్కర్లతో రాజస్థాన్ బ్యాటర్లను ఒత్తిడికి గురి చేసి ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 49), కేఎల్ రాహుల్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/32) రెండు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ(1/40), వానిందు హసరంగా(1/38) చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 51), నితీష్ రాణా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్(1/23), కుల్దీప్ యాదవ్(1/33), మిచెల్ స్టార్క్(1/36) తలో వికెట్ తీసారు.