ఐపీఎల్ 2025 సీజన్ పున:ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. విధ్వంసకర ఓపెనర్ జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్లోని మిగిలిన మ్యాచ్లను ఆడేందుకు జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ ఇండియాకు వచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని స్థానాన్ని ముస్తాఫిజుర్ రెహ్మాన్తో ఢిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ను రూ. 6 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఓపెనర్ స్థానంలో పేసర్ను ఎంచుకోవడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
విఫలమైన ఫ్రెజర్..
అయితే ఈ సీజన్లో జేక్ ఫ్రెజర్-మెక్గర్క్ దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్ల్లో 9.17 సగటుతో 55 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. గత సీజన్లో జేక్ ఫ్రెజర్ మెక్ గర్క్ మెరుగైన ప్రదర్శన చేశాడు. 234.04 స్ట్రైక్రేట్తో 330 పరుగులు కొట్టాడు. దాంతో అతన్ని మెగా వేలంలో రైట్ టూ మ్యాచ్ కార్డ్ వాడి మరి ఢిల్లీ కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు.

ముస్తాఫిజుర్ ట్రాక్ రికార్డ్..
ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఇప్పటి వరకు 57 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 61 వికెట్లు తీసాడు. అతను ఇప్పటి వరకు సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. కీలక ప్లే ఆఫ్స్ ముంగిట బలహీనంగా మారిన బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ముస్తాఫిజుర్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరాలంటే..
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ను వారం పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఐపీఎల్ 2025 సీజన్ను రీస్టార్ట్ చేసేందుకు బీసీసీఐ సిద్దమైంది. శనివారం నుంచి ఐపీఎల్ 2025 సీజన్ పున:ప్రారంభం కానుంది. ఇప్పటికే రివైజ్డ్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ల్లో 6 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే మరో 3 మ్యాచ్ల్లో రెండు గెలవాలి. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్.. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.