ఐపీఎల్ 2024 సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత బోణీ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. తమ సెకండ్ హోమ్ గ్రౌండ్ విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి కేకేఆర్తో జరిగే మ్యాచ్లో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైన పంత్ సేన.. పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్పై 20 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.రోడ్డు ప్రమాదంతో ఏడాదిన్నర సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చిన రిషభ్ పంత్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు.

తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన అతను.. చెన్నైతో జరిగిన గత మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన హిట్టింగ్తో పాత పంత్ను తలపించాడు. దాంతోనే ఢిల్లీ భారీ స్కోర్ చేసి గెలుపును నమోదు చేయగలిగింది. పంత్ ఫామ్లోకి రావడం ఢిల్లీకి కొండంత బలాన్ని తెచ్చిపెట్టింది.
ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పులు చేయకుండా.. విన్నింగ్ టీమ్ను కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫిట్నెస్ సమస్యలతో గత మ్యాచ్కు దూరమైన కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
అతను తుది జట్టులోకి వస్తే యువ బౌలర్ రాసిఖ్ సలామ్ బెంచ్కు పరిమితమవుతాడు. ఈ ఒక్కటి మినహా ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ బరిలోకి దిగనుండగా.. మిడిలార్డర్లో రిషభ్ పంత్, మిచెల్ మార్ష్, ట్రిస్టన్ స్టబ్స్ ఆడనున్నారు.
ఫినిషర్లుగా అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ బరిలోకి దిగనున్నారు. ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్జ్, ముఖేష్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఆడనున్నారు. పేస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ సైతం బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా)
పృథ్వీ షా(ఇంపాక్ట్ ప్లేయర్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ట్రిస్టన్ స్టబ్స్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్జ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్.