ఢిల్లీ క్యాపిటల్స్ యువ ప్లేయర్ సమీర్ రిజ్వీ .. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' మూవీ గ్లింప్స్లోని క్రికెట్ షాట్ను రీక్రియేట్ చేశాడు. స్టెప్ ఔటై.. పిచ్ను బ్యాట్తో గుద్ది ఆడే ఈ షాట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ షాట్ను సమీర్ రిజ్వీ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెద్ది సినిమా గ్లింప్స్లోని హిందీ డైలాగ్స్ను ఈ వీడియోకు ఉపయోగించింది.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో కీలక పోరుకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ షాట్ను రీక్రియేట్ చేసింది. ఉప్పల్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ఈ వీడియోను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫిదా అయ్యాడు. థ్యాంకూ అంటూ ట్వీట్ చేశాడు. సన్రైజర్స్తో మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆల్ది బెస్ట్ చెప్పాడు. అంతేకాకుండా ఆరెంజ్ ఆర్మీతో జాగ్రత్త అంటూ హెచ్చరించాడు.

సన్రైజర్స్తో జాగ్రత్త..
'పెద్ది ఫస్ట్ షాట్ను రీక్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కు ధన్యవాదాలు. నేటి మ్యాచ్కు ఆల్ది బెస్ట్. సన్రైజర్స్ బలంగా పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.'అని ఎక్స్వేదికగా రాసుకొచ్చాడు. ఈ పోస్ట్కు ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ది షాట్ రీక్రియేట్ వీడియోను కూడా జత చేశాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో చెర్రీ 16వ సినిమాగా 'పెద్ది' చిత్రం తెరకెక్కుతుంది.
ఈ చిత్రాన్ని వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్చరణ్ పుట్టినరోజు సందర్బంగా వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
పెద్ది షాట్ ఆడొచ్చా..?
పెద్ది ఐకానిక్ క్రికెట్ షాట్ను మ్యాచ్లో ఆడొచ్చా? అనే సందేహం క్రికెట్ అభిమానులకు నెలకొంది. అయితే ఈ షాట్ను ఆడటం చాలా కష్టం. ఆడే ప్రయత్నం చేసినా బ్యాటర్లకు గాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాటర్కు అంత సమయం దొరకడం కష్టం. స్టెప్ ఔటై.. బ్యాట్ను క్రీజుతో గుద్దితే అంపైర్ ఊరుకోడు. రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాడు. బ్యాట్తో బలంగా క్రీజును గుద్దితే .. పిచ్ డ్యామేజ్ అవుతుంది.
డేంజర్ జోన్లో ఢిల్లీ..
ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టాప్ లేపిన ఢిల్లీ.. ఆ తర్వాత వరుస పరాజయాలతో చతికలపడింది. ప్రస్తుతం 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ చివరి 4 మ్యాచ్ల్లో రెండు గెలవాలి. ప్లే ఆఫ్స్ చేరడానికి ప్రతీ జట్టు 16 పాయింట్స్ సాధించాల్సి ఉంటుంది. రన్రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. టాప్-2లో నిలవాలంటే 18-20 పాయింట్స్ సొంతం చేసుకోవాలి. ఈ క్రమంలోనే సన్రైజర్స్తో జరిగే నేటి మ్యాచ్లో ఢిల్లీ గెలవడం అత్యంత కీలకం.