టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యాడు. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేఎల్ రాహులే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కూతురు పుట్టిందని ట్వీట్ చేశాడు.
అతియా శెట్టిని కేఎల్ రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సీక్రెట్గా లవ్ ఎఫైర్ నడిపించిన ఈ ఇద్దరూ.. 2021లో తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. కుటుంబ సభ్యులను ఒప్పించి 2023, జనవరి 23న వివాహం చేసుకున్నారు.

అతియా ప్రసవం కోసమే కేఎల్ రాహుల్.. ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఎంపికైన రాహుల్.. లక్నో సూపర్ జెయింట్స్తో వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్కు దూరంగా ఉన్నాడు.
ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. డ్యూ నేపథ్యంలో మేం ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే ముందుగా బౌలింగ్ చేస్తున్నాం. గతంలో నేను పంత్తో కలిసి ఆడాను. నా గురించి అతనికి.. పంత్ గురించి నాకు బాగా తెలుసు. మా వ్యూహాలు ఎలాంటి ఉంటాయో ఇద్దరికి తెలుసు.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున చాలా మ్యాచ్లు ఆడాను. మా జట్టు సమతూకంగా ఉంది. ఇక్కడ కొన్నిసార్లు డ్యూ వచ్చింది. గత మూడేళ్లుగా నేను ఢిల్లీ తరఫున ఆడుతున్నాను. లీడర్షిప్ గ్రూప్లో ఒకడిగా ఉన్నాను. అందుకు తగ్గట్లే నేను పనిచేయాల్సి ఉంది. ఓ లీడర్లా ఆలోచించాలి. ఫాఫ్ డుప్లెసిస్, స్టబ్స్, స్టార్క్, ఫ్రెజర్ మెక్గర్క్ మా ఓవర్సీస్ ఆటగాళ్లు.'అని అక్షర్ పటేల్ తెలిపాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.