'ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా, ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే' ... ఓ బలహీనుడు తనకు తానుగా బలవంతునితో తలపడినా.. బలవంతుడే వచ్చి బలహీనుడితో పోటీపడినా జరిగే నష్టం బలహీనుడికేనని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ సామెత బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది.
పాకిస్థాన్ మాటల పట్టుకోని భారత్తో కయ్యానికి కాలు దువ్విన బంగ్లాదేశ్కు అసలు తత్వం బోధపడింది. భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత పొంచి ఉందని టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. క్రికెట్ టీమ్ను భారత్కు పంపించేందుకు నిరాకరించిన బంగ్లా ప్రభుత్వం.. తమ షూటింగ్ జట్టుకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఫిబ్రవరి 2 నుంచి న్యూఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన బంగ్లా షూటింగ్ బృందానికి ఆ దేశ ప్రభుత్వం అనమతిచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఫిబ్రవరి భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బంగ్లా క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. భారత్లో బంగ్లా ఆటగాళ్లకు వచ్చే భద్రతా సమస్య ఏం లేదని స్పష్టం చేసింది. దాంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోగా.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశం కల్పించింది.

క్రికెట్ జట్టు విషయంలో కఠినంగా వ్యవహరించిన బంగ్లా ప్రభుత్వం.. షూటర్ల విషయంలో మాత్రం మెత్తబడింది. ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ స్పోర్ట్స్ సెక్రటరీ మెహబూబ్ ఉల్ ఆలం మాట్లాడుతూ.. షూటింగ్ టీమ్లో ఒక్క షూటర్, కోచ్ మాత్రమే ఉన్నారని, వారి భద్రతకు ముప్పులేదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. షూటింగ్ ఇండోర్ గేమ్ కావడంతో ప్రేక్షకుల సంఖ్య పరిమితంగా ఉంటుందని చెప్పారు. భారత్ నుంచి పూర్తి భద్రతా హామీ కూడా లభించిందని పేర్కొన్నారు.
ఐపీఎల్ 2026 సీజన్ వేలంలో కొనుగోలు చేసిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ను విడుదల చేయాలని కోల్కతా నైట్ రైడర్స్ జట్టును బీసీసీఐ ఆదేశించింది. దాంతో కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది. ఇది బంగ్లా ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది.
ముస్తాఫిజుర్ వంటి స్టార్ ప్లేయర్కే రక్షణ లేనప్పుడు, మొత్తం జట్టును ఎలా పంపుతామని బంగ్లా సాకుగా చూపింది. కానీ ఐసీసీ, భారత్ భద్రత విషయంపై హామీ ఇచ్చినా.. పాకిస్థాన్ మాటలు పట్టుకోని వినలేదు.
నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) సెక్రటరీ జనరల్ పవన్ సింగ్ మాట్లాడుతూ, బంగ్లా షూటర్ల రాకపై తమకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. విదేశీ, క్రీడల మంత్రిత్వ శాఖల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఇప్పటికే లభించాయని, బంగ్లా బృందం జనవరి 31న ఢిల్లీకి చేరుకుంటుందని ఆయన ధృవీకరించారు.