భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య చోటు చేసుకున్న బాల్ టాంపరింగ్ వివాదంపై ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సతీమణి, క్యాండిస్ వార్నర్ ఘాటుగా స్పందించారు. భారత జట్టుకు అంపైర్లు భయపడ్డారని, ఐపీఎల్లో భాగమవ్వాలనే కక్కుర్తితో వివాదాన్ని పెద్దది చేయకుండా, త్వరగా ముగించారని ఆరోపించారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్-ఏ జట్టు ఆస్ట్రేలియా-ఏ టీమ్తో రెండు అనధికారిక టెస్ట్లు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. అయితే తొలి అనధికారిక టెస్ట్ నాలుగో రోజు ఆటలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. భారత ఆటగాళ్లు బాల్ టాంపరింగ్కు ప్రయత్నించారంటూ ఫీల్డ్ అంపైర్ క్రెయిగ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.

భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్తో అతను మాట్లాడిన మాటలు స్టంప్ మైక్స్లో రికార్డ్ అయ్యాయి. బంతిని మార్చడాన్ని ఇషాన్ కిషన్ తప్పుబట్టగా.. బాల్ టాంపరింగ్ చేశారని క్రెయిగ్ అన్నాడు.
బంతి మార్పుపై భారత ఆటగాళ్లు నిలదీయగా.. 'చర్చలకు చోటులేదు. వెళ్లి ఆడండి. ఇక్కడేమీ చర్చా కార్యక్రమం జరగడం లేదు'అని బదులిచ్చాడు. ఈ మాటలకు చిర్రెత్తుకుపోయిన ఇషాన్ కిషన్..'మేం ఇదే బంతితో ఆడాలా? ఇది అత్యంత మూర్ఖత్వ నిర్ణయం'అని బదులిచ్చాడు. వెంటనే అంపైర్..'మీ వల్లే బంతి పాడైంది. నువ్వే(ఇషాన్) బంతి ఆకారాన్ని దెబ్బతీసావు. అందుకే బంతిని మార్చాం. కేవలం మీ వల్లే బంతి మార్పు జరిగింది'అని అంపైర్ ఘాటుగా బదులిచ్చాడు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారని అంతా అనుకున్నారు.
కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఎలాంటి బాల్ టాంపరింగ్ జరగలేదని, బాల్ పాడవడంతోనే మార్చాల్సి వచ్చిందని తమ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే అంపైర్లు ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా పక్కన పెట్టేసారని వార్నర్ సతీమణి క్యాండిస్ వార్నర్ ఆరోపించింది.
ఓ ఆస్ట్రేలియా దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్లో భాగమవ్వాలనే కోరికతోనే అంపైర్లు భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. 'ఇది భారత్ పవర్ ఏంటో తెలియజేస్తోంది. వారు ఎంతటి బలవంతులో స్పష్టం చేస్తోంది. చాలా మంది అంపైర్లు ఐపీఎల్లో భాగమవ్వాలనుకుంటున్నారు.'అని క్యాండిస్ వార్నర్ పేర్కొంది.