David Warner: చెన్నై నగరాన్ని ముంచెత్తిన వరదలను చూస్తుంటే కలిచి వేస్తుందని ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఈ ఊహించని విపత్తు కారణంగా సర్వం పోయినవారిని ఆదుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. తోచిన సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు.
ఇక మిచౌంగ్ తుఫాన్ ధాటికి చెన్నై నగరం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగర జన జీవనం పూర్తిగా స్తంభించి పోయింది. భారీ వర్షాలతో నగరమంతా జలమైంది. భారీ వరదల కారణంగా చెన్నైలో రవాణా సేవలు స్తంభించాయి.

రోడ్డు, రైలు, జల, వాయు మార్గాలు మొత్తం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెన్నై వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కనీస అవసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నై వరదలకు ప్రభావితమైన జనాలను ఆదుకోవాలని వార్నర్ సూచించాడు.
చెన్నైలో కురిసిన భారీ వర్షాలతో జనాలు పడుతున్న ఇబ్బందులు నన్ను కలిచి వేశాయి. ఈ ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయిన ప్రజలకు అందరం అండగా నిలవాలి. అందుబాటులో ఉన్నవారు తోచిన సాయం చేయండి. ప్రతీ ఒక్కరు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను.'అని డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.
భారత క్రికెటర్లు కూడా చెన్నై వర్షాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రజలు జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఈ ప్రతికూల పరిస్థితులను కలిసి కట్టుగా ఎదురిద్దామని టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పిలుపునిచ్చాడు.
'చెన్నై నగరవాసులారా.. మీరు క్షేమంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజల కోసం కష్టపడుతున్న అధికారులు, సిబ్బందికి నా సెల్యూట్. కలిసికట్టుగా ఉందాం. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమిద్దాం" అని దినేశ్ కార్తిక్ ట్వీట్ చేశాడు.
భారీ వర్షాల నేపథ్యంలో జనాలంతా ఇళ్లలోనే ఉండాలని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. 'ప్రజలారా..ఇళ్లలో ఉండేందుకే ప్రయత్నించండి. పరిస్థితి ఏమాత్రం బాలేదు. వర్షం ఆగిపోయినా.. సాధారణ స్థితిలోకి వచ్చేందుకు సమయం పడుతుంది" అని అశ్విన్ ట్వీట్ చేశాడు. వరద నీటి కారణంగా రోడ్డు కోతకు గురైన వీడియోను జత చేశాడు.
ఐపీఎల్లో చెన్నై నగరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కూడా సురక్షితంగా ఉండాలని రిక్వెస్ట్ చేసింది. అజింక్యా రహానేతో పాటు శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ కూడా చెన్నై వరదలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెట్టారు.