
బెంగళూరు: అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం కొనసాగుతోంది. భారీ ధర పలుకుతారని భావించిన ఆటగాళ్లు తక్కువ ధరే పలుకుతున్నారు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ మరీ ఘోరంగా రూ. 6.25 కోట్లే పలికాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని చాల తక్కువ ధరకే కొనుగోలు చేసింది. వార్నర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క జట్టే అసక్తికనబర్చింది. ఆరంభంలో బిడ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఆ తర్వాత తప్పుకుంది. ఢిల్లీకి కేకేఆర్ పోటీ ఇవ్వడంతో ఆ మాత్రం ధరనైనా వార్నర్ పలికాడు.
ఇక సన్రైజర్స్ హైదరాబాద్ అయితే మార్కీ ప్లేయర్ల జోలికే వెళ్లలేదు. ఒక్క ఆటగాడిపై కూడా బిడ్ చేయలేదు. తమ మాజీ కెప్టెన్ అయిన వార్నర్ కోసం కూడా ప్రయత్నించలేదు. టామ్ మూడీ నేతృత్వంలో సన్రైజర్స్ మేనేజ్మెంట్ అతన్ని తీసుకుంటుందని వార్తలు వచ్చినా అవన్నీ పుకార్లేనని స్పష్టమైంది.
ఇక డేవిడ్ వార్నర్ గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున రూ.12.50 కోట్ల వేతనాన్ని అందుకున్నాడు. ఐపీఎల్ 2018 వేలంలో అతన్ని సన్రైజర్స్ ఈ భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో దారుణంగా విఫలమవడంతో వదిలేసింది. అయితే టీ20 ప్రపంచకప్లో సూపర్ బ్యాటింగ్తో చెలరేగి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన వార్నర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఎగబడతాయని అంతా భావించారు. కనీసం రూ. 10 నుంచి 15 కోట్లు పలుకుతాడని అంచనా వేసారు. కానీ అతను సగం ధరకే ఢిల్లీకి సొంతమయ్యాడు. ఏ జట్టు తరఫున ఐపీఎల్ కెరీర్ ప్రారంభించాడో మళ్లీ అదే జట్టులోకి వెళ్లాడు.
ఇక వేలంలో శిఖర్ ధావన్ను రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్, రవిచంద్రన్ అశ్విన్ను రూ. 5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, ప్యాట్ కమిన్స్ను కోల్కతా నైట్రైడర్స్ రూ. 7.25 కోట్లకు, కగిసో రబడాను పంజాబ్ కింగ్స్ రూ. 9.25 కోట్లకు, ట్రెంట్ బౌల్ట్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 8 కోట్లకు, మహమ్మద్ షమీ రూ. 6.25 కోట్లు గుజరాత్ టైటాన్స్కు ఫాఫ్ డుప్లెసిస్ను రూ. 7 కోట్లకు, క్వింటన్ డికాక్ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది.