న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మరోసారి క్రికెట్ ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డాడు. తన పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తిస్తున్న తీరు చాలా హాస్యాస్పదంగా ఉందన్నాడు. అంతగా క్షమించరాని నేరం తానే ఏం చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు.
బాల్ టాంపరింగ్ ఉదంతంలో డేవిడ్ వార్నర్పై క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేధం విధించడంతో పాటు కెప్టెన్సీపై జీవితకాలం నిషేధం విధించింది. బాట్ టాంపరింగ్ ఘటనలో వార్నర్తో పాటు ఉన్న స్టీవ్ స్మిత్ను మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా చూసి చూడనట్లు వదిలేసింది. దాంతో అతను మళ్లీ టీమ్ వైస్ కెప్టెన్ అయ్యి.. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును కూడా నడిపిస్తున్నాడు.

దాంతో తీవ్ర అసహనానికి గురైన వార్నర్ సీఏ విధించిన కెప్టెన్సీ బ్యాన్పై రివ్యూ పిటిషన్ను దాఖలు చేశాడు. అయితే, ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్.. కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో వార్నర్ ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నాడు. మరిచిపోవాలనుకున్న విషయాలను పదే పదే గుర్తు చేసుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డాడు. 'నా విషయంలో సీఏ తీరు నవ్వులాటగా ఉంది. నేను గతాన్ని ముగిద్దామని భావిస్తుంటే, వారు మాత్రం ఇంకా కొనసాగించాలనే ధోరణితో ప్రవర్తిస్తున్నారు. బోర్డులో ఒక్కరు కూడా పారదర్శకంగా లేరు. ఎవరూ జవాబుదారీగా ఉండకూడదని, ఎవరూ నిర్ణయం తీసుకోకూడదనుకొన్నారు. సీఏ పాలనలో స్పష్టంగా నాయకత్వ లోపం కనిపించింది. నేను వదిలేద్దామని అనుకున్న ప్రతిసారీ సీఏ పెద్దలు దానిని బయటకు తీస్తూనే ఉన్నారు.
అదంతా నా వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపింది. టెస్టు మ్యాచ్ల సందర్భంగా ప్రతి రోజూ నాకు ఉదయాన్నే లాయర్ల నుంచి ఫోన్లు వచ్చేవి. అవి నన్ను చికాకుకు గురి చేశాయి. ఇదంతా నాకు అగౌరవంగా అనిపించింది. అది నా బ్యాటింగ్ ప్రదర్శనను దెబ్బతీసింది. ఆటపై దృష్టిసారించలేకపోయా. ఇది జరిగి తొమ్మిది నెలలు అవుతోంది. గతేడాది ఫిబ్రవరిలో మొత్తం డ్రామా ప్రారంభమైంది. దీంతో నేను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా'' అని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.
జూన్ 7-11 మధ్య లండన్లోని ఓవల్ మైదానం వేదికగా భారత్తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్ ముంగిట వార్నర్.. సీఏకు వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది.