న్యూఢిల్లీ: పిచ్ను సరిగ్గా అంచనా వేయకపోవడంతో పాటు బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో సొంతగడ్డపై మంగళవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డేవిడ్ వార్నర్.. పిచ్ను సరిగ్గా రీడ్ చేయలేకపోయామని తెలిపాడు. గుజరాత్ టైటాన్స్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అసాధారణ బ్యాటింగ్తో తమ ఓటమిని శాసించాడని చెప్పాడు.
'ఈ వికెట్పై ఇంతలా స్వింగ్ ఉంటుందని అస్సలు ఊహించలేకపోయాం. పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోతే బ్యాటింగ్ చాలా కష్టంగా ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ మాత్రం పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో చూపించింది. ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. ఇక్కడ మేం ఇంకా ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ముందుగా పిచ్ కండిషన్స్ను అర్థం చేసుకోవాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా బౌలింగ్ చేసింది.

మేం కూడా సూపర్ బౌలింగ్తో విజయవకాశాలను సృష్టించుకున్నాం. కానీ సాయి సుదర్శన అసాధారణ బ్యాటింగ్తో మా విజయాన్ని లాగేసాడు. డేవిడ్ మిల్లర్ ఎప్పటిలాగే తన పనిని పూర్తి చేశాడు. 180-190 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే అక్షర్ పటేల్తో బౌలింగ్ చేయించలేదు. మిచెల్ మార్ష్తో కలిసి కుల్దీప్ యాదవ్ ప్రభావం చూపుతాడని మేం భావించాం.'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది. డేవిడ్ వార్నర్(32 బంతుల్లో 7 ఫోర్లతో 37), అక్షర్ పటేల్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ఇతర బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రషీద్ ఖాన్(3/31), మహమ్మద్ షమీ(3/41) మూడేసి వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించగా... అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలోనే 163 పరుగులు చేసి 11 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సాయి సుదర్శన్(48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 62 నాటౌట్), డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 31 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ 2 వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీసారు.