ధర్మశాల: ఐపీఎల్ 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్నందుకుంది. పంజాబ్ కింగ్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించి 15 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ అవకాశాలను కూడా దెబ్బతీసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో తమ చెత్త ఫీల్డింగ్ ఓటమికి కారణమవుతుందని భావించానని, కానీ విజయాన్నందుకున్నామని తెలిపాడు.

'మా ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. అయినా మా బలాలను నమ్ముకొని విజయం సాధించాం. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై ఆడటం కలిసొచ్చింది. మా హోమ్ గ్రౌండ్లో మాత్రం మాకు ప్రతికూల ఫలితాలే వచ్చాయి. పృథ్వీ షా తన ఆటతో ఈ మ్యాచ్లో ప్రభావం చూపాడు. రిలీ రోసౌ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
ఇదే నిలకడను మా హోమ్ గ్రౌండ్లో కూడా చూపించాల్సిన అవసరం ఉంది. మా సొంతగడ్డపై భారీ లక్ష్యాలను నమోదు చేయలేకపోతున్నాం. ఈ రోజు మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లు సాధించడం గొప్పగా ఉంది.'అని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. పృథ్వీ షా(38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 54), రీలే రోసౌ(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 82 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్(31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 46), ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
పంజాబ్ బౌలర్లలో సామ్ కరణ్ ఒక్కడే 2 వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులే చేసి ఓటమిపాలైంది. లియామ్ లివింగ్ స్టోన్(48 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 94 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగినా ఫలితం లేకపోయింది.
లివింగ్ స్టోన్కు తోడుగా అథర్వ టైడే(42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 55) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్జ్ రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.