న్యూఢిల్లీ: చెత్త బ్యాటింగే మరోసారి తమ కొంపముంచిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఢిల్లీ 77 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన వార్నర్.. చెన్నై సూపర్ కింగ్స్ అసాధారణ బ్యాటింగ్తో తమ ఓటమిని శాసించిందన్నాడు.
'ఈ విజయం క్రెడిట్ చెన్నై సూపర్ కింగ్స్దే. అసాధారణ బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. మేం కూడా ఆరంభంలోనే బౌండరీలు రాబట్టి ఉంటే చెన్నై బౌలర్లు ఒత్తిడికి గురయ్యేవారు. అయితే ఈ మ్యాచ్ ఓడినా కొన్ని సానుకూలంశాలు లభించాయి. బంతితో మరి అంత చెత్త ప్రదర్శన చేయలేదు. కానీ బ్యాటింగ్లో మాత్రం కీలకమైన భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోయాం.

వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకున్నాం. ఈ సీజన్లో మేం కొన్ని మ్యాచ్ల్లో దారుణంగా ఓడిపోయాం. ఆ పరాజయాలు మమ్మల్ని దెబ్బతీసాయి. ఈ తప్పిదాలను సరిచేసుకొని తదుపరి సీజన్లో బలంగా బరిలోకి దిగుతాం. పిచ్లను మేం నిందించడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా వాటికి అనుగుణంగా ఆడాలి. గేమ్ ప్లాన్కు తగ్గట్లు ఆడుతూ బౌండరీలు బాదాలి. స్వేచ్చగా స్పిన్ను ఎదుర్కొవాలి.
భాగస్వామ్యాలు నెలకొల్పడం అత్యంత ముఖ్యం. టాపార్డర్లో నేను నిలకడగా రాణించాలనుకున్నాను. కానీ బ్యాటింగ్ పవర్ ప్లేలోనే మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. అది నా స్ట్రైక్రేట్పై ప్రభావం చూపింది. ఈ విషయాలన్నిటిపై మేం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 79), డేవాన్ కాన్వే( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 87 )విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
శివమ్ దూబే(9 బంతుల్లో 3 సిక్స్లతో 22), రవీంద్ర జడేజా(7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
కెప్టెన్ డేవిడ్ వార్నర్(58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 86) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు తీయగా.. మహీశ్ తీక్షణ, పతీరణ రెండేసి వికెట్లు పడగొట్టారు. తుషార్ దేశ్పాండే, జడేజాకు తలో వికెట్ దక్కింది.