చెన్నై: పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోవడం.. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడకపోవడం తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ వార్నర్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో ఢిల్లీ 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. చివరి మూడు మ్యాచ్ల్లో గెలిచినా.. ప్లే ఆఫ్స్కు వెళ్లే పరిస్థితి ఢిల్లీకి లేదు.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డేవిడ్ వార్నర్.. పేలవ బ్యాటింగ్తోనే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలయ్యామని తెలిపాడు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయామని చెప్పిన వార్నర్.. టాప్-6 మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు.

'వరుసగా మూడు వికెట్లు కోల్పోవడం మా ఓటమిని శాసించింది. లక్ష్యచేధనలో ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. కానీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయాం. ఆ వెంటనే రనౌట్ రూపంలో మరో వికెట్ను చేజార్చుకున్నాం. మేం నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకున్నాం. దాంతో తర్వాత బ్యాటింగ్కు వచ్చే ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
చెన్నై నమోదు చేసిన లక్ష్యం గొప్పదే. అధిగమించ దగినిదే. ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఆడాల్సింది. ముఖ్యంగా మా టాప్-6 బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయాలి. మేం సరిగ్గా స్ట్రైక్ను రొటేట్ చేయలేకపోయాం. మేం కొత్తగా చేయాల్సింది. కానీ చేయలేకపోయాం. వైడ్ హాఫ్ ట్రాకర్ ఉన్నప్పుడు కవర్ దిశగా హిట్ చేయవద్దు. వైడ్ హాఫ్ ట్రాక్సర్స్కు తగ్గట్లు మేం మెరుగైన వ్యూహంతో బ్యాటింగ్ చేయాల్సింది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ( 9 బంతుల్లో, ఫోర్, 2 సిక్స్లతో 20) శివమ్ దూబే(12 బంతుల్లో 3 సిక్స్లతో 25), అంబటి రాయుడు (17 బంతుల్లో బౌండరీ, సిక్స్తో 23) మెరుపులు మెరిపించారు.
ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్లకు తలో వికెట్ దక్కింది. చివర్లో ధోనీ ధాటిగా ఆడటం చెన్నైకి కలిసొచ్చింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
రిలీ రోసౌ(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 35), మనీశ్ పాండే(29 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో మతీశ పతీరణ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కింది.