
హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రయాణాన్ని ఉద్దేశించి ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పాటు సపోర్ట్ స్టాఫ్కు ధన్యవాదాలు తెలిపాడు. 'ఈ సీజన్ మాకు కలిసిరాలేదు. కానీ ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లతో ఆడేందుకు ఎప్పుడూ సంతోషంగా ఫీలవుతా. అండగా నిలిచిన అభిమానులకు,సపోర్ట్ స్టాఫ్కు ధన్యవాదాలు'అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్కు కొన్ని ఫొటోలను కూడా జత చేశాడు. అయితే ఈ ఫొటోలో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రధాన ఆటగాళ్లంతా ఉండగా.. మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రం లేడు.
దాంతో అతను కేన్ విలియమ్సన్ను నిలదీశాడు. 'మామా.. నీవు షేర్ చేసిన ఫొటోల్లో నేను లేను. మనద్దరి బంధం గట్టిదనుకున్నా'అంటూ బాధతో కూడిన ఏమోజీలను కామెంట్ చేశాడు. దీనికి కేన్ మామ సైతం బదులిచ్చాడు. అయ్యో అనే ఏమోజీని రిప్లే ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట వైరల్గా మారింది. ఇక ముంబై ఇండియన్స్తో శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇక ఈ సీజన్లో హైదరాబాద్ పోరాటం ముగియడంతో డేవిడ్ వార్నర్ అభిమానులను ఉద్దేశించి ఇన్స్టా వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. హైదరాబాద్ జట్టుతో పాటు అభిమానులను మిస్ అవుతానని తెలిపాడు. ఇన్నాళ్లు అండగా నిలిచిన అభిమానులుకు సరిపడా కృతజ్ఞతలు చెప్పలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఈ మధుర జ్ఞాపకాలను అందించిన మీ అందరికి ధన్యవాదాలు. అభిమానులారా.. మా జట్టు ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేసేలా మద్దతుగా నిలిచారు. మీ అభిమానానికి సరిపడా కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోతున్నా. ఇదో గొప్ప ప్రయాణం. నేను, నా కుటుంబం మిమ్మల్ని మిస్ కాబోతున్నాం. 'అని పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్లో సన్రైజర్స్ వరుస పరాజయాలను చవిచూసింది. దాంతో టీమ్ వైఫల్యాలకు బాద్యుణ్ని చేస్తూ.. డేవిడ్ వార్నర్పై టీమ్మేనేజ్మెంట్ వేటు వేసింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి కేన్ విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా తుది జట్టులో నుంచి కూడా తప్పించింది. ఆ తర్వాత కేన్ మామ సారథ్యంలో ఒకే ఒక మ్యాచ్ జరగ్గా కరోనాతో లీగ్ అర్ధంతరంగా వాయిదా పడింది. ఇక యూఏఈ వేదికగా ప్రారంభమైన సెకండాఫ్ లీగ్లో వార్నర్కు మళ్లీ తుది జట్టులో అవకాశం దక్కింది. జానీ బెయిర్ స్టో చివరి క్షణంలో తప్పుకోవడంతో వార్నర్ సాహాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
వరుసగా రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనిపై మళ్లీ వేటు వేసిన టీమ్మేనేజ్మెంట్ జాసన్రాయ్కు చాన్స్ ఇచ్చింది. అతను హాఫ్ సెంచరీతో చెలరేగడంతో వార్నర్కు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాతి మ్యాచ్లకు మైదానంలోకి కూడా వార్నర్ రాలేదు. హోటల్ రూమ్కే పరిమితమయ్యాడు. మ్యాచ్ జరుగుతుండగా ఇన్స్టా వేదికగా సంచలన పోస్ట్లు షేర్ చేశాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఇదే నా చివరి సీజన్ కావచ్చన్నాడు. కేకేఆర్తో జరిగిన గత మ్యాచ్లో మైదానానికి వచ్చినా.. అతన్ని డగౌట్కు అనుమతించలేదు. దాంతో చేసేదేమిలేక ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్నాడు.