మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో టీమిండియాతో ఆడే టెస్టు సిరీస్లో కెప్టెన్ విరాట్కోహ్లీని స్లెడ్జ్ చేయనని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పష్టంచేశాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'విరాట్ కోహ్లీని ఏ మాత్రం కవ్వించొద్దు. అతడు అలాంటి ఆటగాడు కాదు. ఎలుగుబంటిని రెచ్చగొట్టడంలో అర్థమే లేదు. ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో అతడిని స్లెడ్జింగ్ చేయను' అని వార్నర్ పేర్కొన్నాడు.
2018-2019 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీసేన టెస్టు సిరీస్ గెలుపొంది చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వార్నర్ బాల్టాంపరింగ్ నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఇక అంతకుముందు ఆడిన సిరీస్లో రోహిత్శర్మ, విరాట్ కోహ్లీలతో దురుసుగా ప్రవర్తించి నోరు పారేసుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని ఏడాది నిషేధం ఎదుర్కొవడంతో అతడి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది.
ఇక 2018-19 భారత్ విజయంపై స్పందిస్తూ.. ఆ సిరీస్లో భారత్ బాగా ఆడిందని, ఆ జట్టు బౌలర్లు చెలరేగడంతో తమ జట్టు ఓడిపోయిందని వార్నర్ అభిప్రాయపడ్డాడు. ఈసారి ఆ రసవత్తర పోరుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే టెస్టు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. అయితే, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆ సిరీస్ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే అవకాశం ఉందన్నాడు.
అలా స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా భారత్తో ఆడటం బాగుండదన్నాడు. మరోవైపు భారత బ్యాటింగ్ లైనప్ ప్రస్తుతం పటిష్టంగా ఉందని, వారిని టార్గెట్ చేసేందుకు తమ బౌలర్లు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్పై స్పందించిన వార్నర్.. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదా పడి అదే సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే తమ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశాడు. తమ బోర్డు అనుమతిస్తే వేలంలో ఎంపికైన వారంతా ఐపీఎల్ ఆడతారన్నాడు. దానికి ప్రభుత్వ అనుమతి కూడా కావాలని చెప్పుకొచ్చాడు.
ఎందుకు ఎగిరిపడుతున్నారు.. జయవర్ధనే, సంగక్కరలను ప్రశ్నించిన లంక మాజీ మంత్రి