ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరిగే ఐదు టెస్ట్ల సిరీస్కు తన అవసరం ఉందనుకుంటే అందుబాటులో ఉంటానని తెలిపాడు. ఒక్క ఫోన్ చేస్తే వచ్చేస్తానని చెప్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడటం కోసం అంతకంటే ముందు షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్కు వార్నర్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్తో జరిగిన టెస్ట్ సిరీస్తో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన వార్నర్.. 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్తో వైట్ బాల్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

'ఆస్ట్రేలియా కోసం ఆడాలని జట్టు నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా ఆడేందుకు నేను సిద్దంగా ఉన్నాను. ఆట పట్ల నేనెప్పుడూ సీరియస్గా ఉంటాను. ఆస్ట్రేలియా తన చివరి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరిలో ఆడింది. నేను జనవరిలో ఆడాను అంతే.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టుకు నా అవసరం ఉందంటే.. షెఫీల్డ్ షీల్డ్ ఆడేందుకు కూడా నేను సిద్దంగా ఉన్నాను. నా ఫామ్ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను సరైన కారణాల వల్ల ఆటకు వీడ్కోలు పలికాను. కానీ అవసరమైతే జట్టు తరఫున ఎల్లప్పుడూ ముందుంటా. ఈ విషయంలో ఏ మాత్రం సిగ్గుపడను.'అంటూ వార్నర్ తన మనసులోని మాట చెప్పుకొచ్చాడు. డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 112 టెస్ట్లు ఆడి 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలతో సహా 8786 పరుగులు చేశాడు.