న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎస్కే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ల మధ్య చోటు చేసుకున్న ఈ సరదా ఘటన నవ్వులు పూయిస్తోంది. జడేజా రనౌట్ కోసం త్రో వేస్తూ బెదిరించగా.. క్రీజులో బ్యాట్ పెట్టని వార్నర్.. అతని ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్ను ఇమిటేట్ చేశాడు.
కత్తిని తిప్పినట్లు బ్యాట్ను తిప్పాడు. దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు అంపైర్లు నవ్వుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సందర్భంగా దీపక్ చాహర్ వేసిన 5వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని డేవిడ్ వార్నర్ కవర్ దిశగా ఆడి రిస్కీ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు.

బంతిని అందుకున్న మొయిన్ అలీ రనౌట్ చేయడంలో విఫలమయ్యాడు. బంతి వికెట్లను తాకితే వార్నర్ ఔటయ్యేవాడు. బ్యాకప్గా వచ్చిన అజింక్యా రహానే వార్నర్ క్రీజు ధాటడంతో మరోసారి రనౌట్కు ప్రయత్నించగా జడేజా అందుకున్నాడు. ఇక రనౌట్ చేస్తా అంటూ జడేజా బంతితో బెదిరించగా.. చేయి అన్నట్లు చిందులేసిన వార్నర్ బ్యాట్ను కత్తిలా తిప్పాడు. దాంతో నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 77 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 79), డేవాన్ కాన్వే( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 87 )విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
శివమ్ దూబే(9 బంతుల్లో 3 సిక్స్లతో 22), రవీంద్ర జడేజా(7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
కెప్టెన్ డేవిడ్ వార్నర్(58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 86) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు తీయగా.. మహీశ్ తీక్షణ, పతీరణ రెండేసి వికెట్లు పడగొట్టారు. తుషార్ దేశ్పాండే, జడేజాకు తలో వికెట్ దక్కింది.