కంగ్రాట్స్ నట్టూ..
నటరాజన్ టీమిండియా టీ20 జట్టులో అవకాశం దక్కించుకోవడంపై సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సంతోషం వ్యక్తం చేశాడు. కంగ్రాట్స్ నట్టూ.. ఆస్ట్రేలియాలో కలుద్దామని ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోను సన్రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. ఈ వీడియోలో అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన డేవిడ్ వార్నర్ తదుపరి సీజన్లో మరింత అలరిస్తామని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో నటరాజన్కు అభినందనలు తెలియజేశాడు. అంతకుముందు‘ఈ టోర్నీలో మేం కనుగొన్న ప్లేయర్ నటరాజన్. అతడు అద్భుతంగా రాణించాడు.' అని వార్నర్ అన్నాడు.

యార్కర్ల నట్టూ..
ఈ సీజన్లో నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 8.02 ఎకానమీతో 16 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనే టీమిండియాకు ఎంపికయ్యేలా చేసింది. మరే ఇతర బౌలర్ సాధ్యం కానీ విధంగా ఈ సీజన్లో నటరాజన్ సుమారు 65 యార్కర్లు వేసాడు. దాంతోనే తన పేరును యార్కర్ల నట్టూగా మార్చుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్ 2లో కూడా చివరి ఓవర్లలో అద్భుతంగా యార్కర్లు వేసి భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. నట్టూ బౌలింగ్కు యువరాజ్ సింగ్, హర్షాబోగ్లే సైతం ఫిదా అయ్యారు.

సన్నాఫ్ డైలీ లేబర్
ఇక ఇంతటి ప్రతిభ ఉన్న నటరాజన్ అందరి క్రికెటర్లలా సంపన్నుడు కాదు. అతను ఈ స్థాయికి ఊరికే చేరుకోలేదు. అతడి ఎదుగుదల వెనక పుట్టెడు దు:ఖం ఉంది. కటిక పేదరికం, కుటుంబ బాధ్యతలూ ఉన్నాయి. తమిళనాడు సేలం జిల్లాలోని చిన్నప్పంపట్టి అనే కుగ్రామం నుంచి తంగరసు నటరాజన్ తారజువ్వాలా దూసుకు వచ్చాడు. అతడి తండ్రి డైలీ లేబర్. తల్లి మాంసం, కూరగాయల విక్రేత. చిన్నప్పట్నుంచి క్రికెట్ అంటే ఇష్టం. సరదాగా స్నేహితులతో కలిసి ఆడేవాడు. మనలానే టెన్నిస్ బంతితో ఆడేవాడు.అలా ఆ బంతితో యార్కర్లు వేయడంలో ఆరితేరాడు. చిన్నచిన్న టోర్నీల్లో ఆడుతూ తన జట్టును గెలిపిస్తుండేవాడు. అలా చెన్నై క్రికెట్ ఆడే జయ ప్రకాశ్ కంటపడ్డాడు. ఆయన నటరాజన్ తల్లిదండ్రుల్ని ఒప్పించి అతడిని చెన్నై తీసుకెళ్లాడు. ఆయా క్లబ్బుల్లో ఆడేలా చేశాడు. అపార ప్రతిభ ఉన్న నటరాజన్ కూడా వెనక్కు చూసుకోకుండా దూసుకెళ్లాడు.

వేలంలో రూ.3 కోట్లు
తమిళనాడు ప్రీమియర్ లీగ్లో సత్తా చాటిన నటరాజన్ను 2017 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అప్పటి వరకు డబ్బే అవసరంగా బతికిన అతనికి ఒక్కసారిగా భారీ మొత్తంలో రావడంతో తెగ ఆనందపడ్డాడు. కానీ భాషా సమస్యవల్ల ఇతర ఆటగాళ్లను కమ్యూనికేట్ చేయలేక నటరాజన్ ఇబ్బంది పడ్డాడు. 6 మ్యాచుల్లో 2 వికెట్లే తీసి 115 పరుగులు ఇవ్వడంతో ఆ తర్వాతి సీజన్లో ఆ ఫ్రాంచైజీ అతడిని వదిలేసింది. అయితే టీఎన్పీఎల్లో అతడి ప్రతిభను గమనించిన సన్రైజర్స్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్ 2018 వేలంలో రూ.40 లక్షలకు హైదరాబాద్ కొనుగోలు చేసేలా కృషిచేశాడు. పూర్తిగా బౌలర్లతో ఉండే హైదరాబాద్లో అతనికి అవకాశాలు రాలేదు. అయితే 2019 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అదరగొట్టి హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కచ్చితత్వంతో యార్కర్లు వేస్తూ ఉండటంతో జట్టులో కొనసాగాడు.


Click it and Unblock the Notifications

IPL 2020: ఆ యువ ఆటగాళ్ల ఆటకు నేను ఫిదా: బ్రియాన్ లారా










