హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముంగిట ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బాంబు పేల్చాడు. అతి త్వరలోనే టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలకబోతున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ నిర్ణయం తన ఫామ్పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు.
భారత్తో జూన్ 7 నుంచి జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఈ ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్లో ఆశించిన రీతిలో రాణిస్తే సొంతగడ్డపై పాకిస్థాన్తో జరిగే టెస్ట్ సిరీస్ వరకు కొనసాగుతానని వెల్లడించాడు. లేకుంటే ముందుగానే టెస్ట్ ఫార్మాట్కు గుడ్బై చెబుతానని పేర్కొన్నాడు.

2024 టీ20 ప్రపంచకప్తో కెరీర్ మొత్తానికి వీడ్కోలు పలుకుతానని వెల్లడించాడు. 'ప్రస్తుతం నేను బాగానే రాణిస్తున్నా. జట్టుకు కావాల్సిన పరుగులు చేస్తున్నా. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్తో నా సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నా. ఇప్పటికే ఈ విషయాన్ని నా కుటుంబానికి తెలియజేసాను.
డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు యాషెస్ సిరీస్లో రాణించడంపై నా టెస్ట్ కెరీర్ ఆధారపడి ఉంది. ఈ రెండు సిరీస్ల్లో పరుగులు చేయగలిగితే వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా పాకిస్థాన్తో జరిగే టెస్ట్ సిరీస్తో సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్బై చెబుతాను. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు యాషెస్ సిరీస్లో విఫలమైతే మాత్రం ముందుగానే టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటాను. 'అని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.
గత కొంతకాలంగా డేవిడ్ వార్నర్ నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. గత రెండేళ్లలో 17 టెస్టులు ఆడిన వార్నర్ ఒకే ఒక సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్కు గుడ్బై చెప్పి పరిమిత ఓవర్ల క్రికెట్పై పూర్తి ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు.
అంతేకాకుండా బాల్ టాంపరింగ్ వివాదంలో కెప్టెన్ కాకుండా క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన జీవిత కాలం నిషేధంపై కూడా వార్నర్ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ నిషేధం ఎత్తేయాలని రివ్యూ పిటిషన్ వేసిన వార్నర్.. క్రికెట్ ఆస్ట్రేలియా తీరుతో విసిగిపోయి దాన్ని ఉప సంహరించుకున్నాడు.
2011లో న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. ఇప్పటి వరకు 102 టెస్ట్ల్లో 8158 పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 25 శతకాలు, 33 హాఫ్ సెంచరీలున్నాయి.