
అసలేం జరిగిందంటే..?
ఇంగ్లండ్తో మంగళవారం ముగిసిన సెకండ్ టెస్ట్లో టీమిండియా కెప్టెన్.. జోరూట్ ఔట్ విషయంలో అంపైర్ నితీన్ మీనన్తో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మూడో రోజు చివరి సెషన్లో అక్షర్ పటేల్ వేసిన బౌలింగ్లో జో రూట్ ఎల్బీడబ్ల్యూ కోసం భారత జట్టు అప్పీల్ చేసింది. బంతి రూట్ ప్యాడ్కు వెనుక భాగంలో తగిలిన తర్వాత కీపర్ రిషభ్ పంత్ క్యాచ్ పట్టాడు.
ఫీల్డర్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం నాటౌట్గా ప్రకటించాడు. దీంతో టీమిండియా రివ్యూకు వెళ్లగా.. రీప్లేలో బంతి బ్యాట్కు తగలలేదు కానీ ఆఫ్ స్టంప్స్కు తాకినట్లు చూపించింది. దాంతో థర్డ్ అంపైర్ అంపైర్స్ కాల్గా ప్రకటించి ఫీల్డ్ అంపైర్ నిర్ణయం సరైందేనని ప్రకటించాడు. దాంతో అంపైర్ మీనన్పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి రవిశాస్త్రి కూడా ఔటేనన్నట్లు సైగలు చేశాడు.

అహ్మదాబాద్ టెస్ట్ ఆడకుండా..
అయితే ఐసీసీ నిబంధనలు ఆర్టికల్ 2.8 ప్రకారం మైదానంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగినా.. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినా తప్పిదమే. ఈ నేపథ్యంలోనే విరాట్పై చర్యలు తీసుకోవాలని డేయిలీ మెయిల్కు రాసిన కాలమ్లో డేవిడ్ లాయిడ్ పేర్కొన్నాడు. 'ఒక జట్టుకు కెప్టెన్గా ఉంటూ కోహ్లీ ఇలా ప్రవర్తించడం దారుణం. ఫీల్డ్ అంపైర్పైకి కోపంతో అలా దూసుకెళ్లడం కరెక్ట్ కాదు. ఇంత చేసినా అతన్ని బయటకు పంపించలేదు. అతన్ని అహ్మదాబాద్ టెస్ట్ ఆడకుండా నిషేధించాలి.

క్రికెట్లో రెడ్, ఎల్లో కార్డ్స్..
జెంటిల్మెన్ గేమ్ అని పిలుచుకునే క్రికెట్లో కోహ్లీ చర్యల వల్ల ఇక్కడ కూడా రెడ్, యెల్లో కార్డులు జారీ చేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే అంపైర్పై కోహ్లీ కోపం వ్యక్తం చేసినందుకు గానూ రెడ్ కార్డ్ చూపించి మూడు టెస్టులు బ్యాన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్రికెట్ కాకుండా మరే ఆటైనా కోహ్లీ తన ప్రవర్తనతో మైదానం వీడి బయటకు వెళ్లాల్సి వచ్చేది. విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకోకుండా మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ తన ఏసీ గదిలో ఏం పట్టనట్లు కూర్చున్నాడు. మూడున్నర రోజులైనా ఈ ఘటనపై నోరు విప్పలేదు'అని డేవిడ్ లాయిడ్ అసహనం వ్యక్తం చేశాడు.

మరో రెండు వస్తే..
కోహ్లీ పేరు మీద ఇప్పటికే రెండు డీ-మెరిట్ పాయింట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 24 నెలల్లో ఈ డీ-మెరిట్ పాయింట్లు నాలుగుకు చేరితే సదరు క్రికెటర్ ఒక టెస్టు లేదా రెండు వన్డే, టీ20లకు సస్పెన్షన్కు గురయ్యే అవకాశం ఉంది. ఇక సెకండ్ టెస్ట్లో భారత్ 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












