ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఫైనల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. 'హ్యాండిల్డ్ ది బాల్' వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ తన ప్యాడ్లో ఇరుక్కున్న బంతిని చేత్తో కిందపడేయడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఔటంటే.. మరికొందరు నాటౌట్ అని కామెంట్ చేస్తున్నారు.
గురువారమైన రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా బ్యూ వెబ్స్టర్ వేసిన 49వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని వెబ్స్టర్ ఆఫ్ స్టంప్ లైన్లో వేయగా.. బెడింగ్హమ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి బెడింగ్హమ్ ప్యాడ్లో ఇరుక్కుంది. ఆ బంతి కిందికి వచ్చే అవకాశం ఉండటంతో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్ కోసం ప్రయత్నించాడు. కానీ బెడింగ్హమ్ బంతిని చేత్తో తీసి కిందపడేసాడు. దాంతో ఆసీస్ ఆటగాళ్లు 'హ్యాండిల్డ్ ది బాల్' గురించి అప్పీల్ చేశారు. అయితే అంపైర్లు నాటౌట్గా ఇచ్చారు. అప్పటికే బంతి డెడ్ బాల్ అయిందని స్పష్టం చేశారు.

క్రికెట్ నియమాల ప్రకారం బంతి బ్యాటర్ ప్యాడ్లలో లేదా దుస్తుల్లో ఇరుక్కుంటే డెడ్ బాల్గా పరిగణిస్తారు. బ్యాటర్ పట్టుకున్నా నాటౌట్గానే ఇస్తారు. అయితే రిప్లేలో బంతి కిందపడేసే క్రమంలో బెడింగ్హమ్ బంతిని పట్టుకోవడం వివాదమైంది. బంతి డెడ్ అయినప్పుడు కాకుండా కదులుతూ ఉన్న సమయంలో పట్టుకున్నాడని, ఔటేనని కొంతమంది వాదిస్తున్నారు.
బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా చేతితో బంతిని అడ్డుకుంటే హ్యాండిల్డ్ ది బాల్ రూల్ కింద ఔటిస్తారు. బ్యాటర్ బంతి వికెట్ల వైపు వెళ్లకుండా అడ్డుకోవడం లేదా ఫీల్డర్ క్యాచ్ పట్టకుండా చేస్తే ఈ రూల్ కింద ఔట్ ఇస్తారు. బ్యాటర్ తన శరీరాన్ని గాయం నుంచి రక్షించుకోవడానికి బంతిని చేతితో తాకితే మాత్రం ఔటివ్వకుండా మినహాయింపు ఇస్తారు.
గతంలో 'హ్యాండిల్డ్ ది బాల్' అనేది క్రికెట్ నిబంధనల్లో ఒక ప్రత్యేకమైన ఔట్(లా 33) పద్ధతిగా ఉండేది. 2017లో MCC (మేరిల్బోన్ క్రికెట్ క్లబ్) ఈ రూల్ను సవరించింది. ఈ రూల్ను అబ్స్టక్టింగ్ ద ఫీల్డ్(లా 37) అనే నియమంలో విలీనం చేసింది. ఈ రూల్ ప్రకారం బంగ్లాదేశ్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ ఒక మ్యాచ్లో ఔటయ్యాడు. బౌలర్ వేసిన బంతిని డిఫెండ్ చేసిన తర్వాత, అది వికెట్ల వైపు వెళ్లకుండా అతను చేతితో అడ్డుకున్నాడు.
డబ్యూటీసీ ఫైనల్ 2025పై డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ ఇప్పటికే 218 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. 73 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్ను వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(50 బంతుల్లో 5 ఫోర్లతో 43) ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా విజయం సాధించాలంటే అద్భుతం చేయాలి.