
గువహటి: బౌలింగ్ వైఫల్యమే భారత్తో తొలి వన్డేలో తమ ఓటమికి ప్రధాన కారణమని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక అన్నాడు. మంగళవారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 67 పరుగులతో శ్రీలంను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డసన్ షనక.. పవర్ ప్లేలో ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేదని, కొత్త బంతిని తమ బౌలర్లు సరిగ్గా వాడుకోలేదని చెప్పాడు. సరైన వేరియేషన్స్తో బౌలింగ్ చేసి భారత్ను తక్కువ స్కోర్కే కట్టడి చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.
'భారత ఓపెనర్ల ఆరంభమే మా ఓటమిని శాసించింది. కొత్త బంతిని మేం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. భారత బౌలర్లలా స్వింగ్ రాబట్టలేకపోయాం. భారత బ్యాటింగ్కు తగ్గట్లు ప్రణాళికలతో బరిలోకి దిగినా.. మా బౌలర్లు అమలు చేయలేకపోయారు. తొలి 10 ఓవర్లలో సరైన వేరియేషన్స్తో బౌలింగ్ చేయలేకపోయారు. నా బేసిక్స్కు కట్టుబడి ఆడటంతోనే బ్యాటింగ్లో రాణించగలిగాను. టీ20 ఫార్మాట్లో అప్ది ఆర్డర్లో ఆడాలని ఉన్నా.. టీమ్ అవసరాల దృష్ట్యా నంబర్ 6లో ఆడాల్సి వస్తుంది. భానుక రాజపక్స ఐదో స్థానంలో ఆడుతుంటే అతని తర్వాత నేను బరిలోకి దిగుతున్నాను.'అని షనక చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగులు చేసింది. కోహ్లీ(87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 113) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 83), శుభ్మన్ గిల్(60 బంతుల్లో 11 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా మూడు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, చమిక కరుణరత్నే, డసన్ షనక, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. డసన్ షనక(88 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 108 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. పాతుమ్ నిస్సంక(72) హాఫ్ సెంచరీతో రాణించాడు. 9వ వికెట్కు కసున్ రజితతో కలిసి డసన్ షనక 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు.