
ముంబై: భారత్తో తొలి టీ20లో సరైన ఫినిషింగ్ లేకనే ఓటమిపాలయ్యామని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక అన్నాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లోనూ సరైన ముగింపు ఇవ్వకపోవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 2 పరుగులతో ఉత్కంఠకర విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డసన్ షనక.. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా చేజార్చుకున్నామని తెలిపాడు. ఒక్క బ్యాటర్ క్రీజులో నిలదొక్కుకున్నా.. బౌలింగ్లో స్లాగ్ ఓవర్లలో కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినా ఫలితం మరోలా ఉండేదన్నాడు.
'గెలవాల్సిన మ్యాచ్లో ఓడటం చాలా బాధగా ఉంది. మా ముగింపే సరిగ్గా లేదు. వాంఖడే మైదానంలో చేజింగ్ చేస్తున్నప్పుడు బ్యాటర్లు లైన్ ధాటి ఆడాల్సి ఉంటుంది. మేం సరైన ప్రణాళికలతో భారత్ను 162 పరుగులతో కట్టడి చేశాం. ఏ బ్యాటర్కు ఎవరితో బౌలింగ్ చేయాలో వారితోనే చేయించి ఫలితం రాబట్టాం. కానీ యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా.. అద్భుతంగా పుంజుకుంది. అప్కమింగ్ మ్యాచ్లో ఈ తప్పిదాలను సవరించుకొని బరిలోకి దిగుతాం'అని డసన్ షనక చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. దీపక్ హుడా(23 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 41 నాటౌట్), అక్షర్ పటేల్(20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 31 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్తో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా(29), ఇషాన్ కిషన్ పర్వాలేదనపించారు. లంక బౌలర్లలో దిల్షాన్, మహీశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనుంజ డిసిల్వా, వానిందు హసరంగా ఐదు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. డసన్ షనక(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 45), చమిక కరుణరత్నే(16 బంతుల్లో 2 సిక్సర్లతో 23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీసారు.