కొలంబో: మహమ్మద్ సిరాజ్ అసాధారణ బౌలింగ్తో తమ పతనాన్ని శాసించాడని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్తో జరిగిన ఫైనల్లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన షనక.. తమ ఓటమికి గల కారణాలను తెలియజేశాడు.
కాసేపు ఓపికగా క్రీజులో నిలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. పిచ్ కండిషన్స్ను కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయామని తెలిపాడు. ఘోర పరాజయంతో తమ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచామని, వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

'సిరాజ్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే పిచ్ అనుకున్నా. కానీ ఓవర్కాస్ట్ కండిషన్స్ కీలక పాత్ర పోషించాయి. మాకు కఠినమైన రోజు. మేం మా టెక్నిక్ను ఉపయోగించాల్సింది. కాసేపు క్రీజులో ఉండే ప్రయత్నం చేయాల్సింది. అప్పుడు బ్యాటింగ్కు సులువయ్యేది.
ఫైనల్ మ్యాచ్లో ఓడినా.. ఈ టోర్నీ ద్వారా ఎన్నో సానుకూలంశాలు లభించాయి. సదీర, కుశాల్ బ్యాటింగ్.. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొన్న తీరు అద్భుతం. అసలంక మ్యాచ్ విన్నింగ్ నాక్ కూడా మరిచిపోలేనిది. ఈ ముగ్గురు భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్లో రాణిస్తారని ఆశిస్తున్నాం. కఠిన పరిస్థితుల నుంచి ఎలా పుంజుకోవాలో మాకు బాగా తెలుసు.
ఫైనల్లో మెరుగైన జట్లను ఓడించిన అనుభవం మాకు ఉంది. గత కొన్నేళ్లుగా మా ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. శ్రీలంక అభిమానులకు నా ధన్యవాదాలు. భారీ సంఖ్యలో హాజరై మాకు మద్దతు తెలిపారు. కానీ వారు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాం. అభిమానులందరికి నా క్షమాపణలు. ఆసియాకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు అభినందనలు'అని షనక చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్(6/21) సంచలన బౌలింగ్తో 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా(3/3), జస్ప్రీత్ బుమ్రా(1/23) సత్తా చాటారు. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(17), దుషన్ హేమంత(13 నాటౌట్)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్(18 బంతుల్లో 3 ఫోర్లతో 23 నాటౌట్), శుభ్మన్ గిల్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27 నాటౌట్) రాణించారు.