
రాజ్కోట్: సూర్యకుమార్ అసాధారణ ఇన్నింగ్స్తో ఓటమికి తలవంచాల్సి వచ్చిందని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక అన్నాడు. భారత్తో శనివారం జరిగిన మ్యాచ్లో శ్రీలంక 91 పరుగులతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన షనక.. సూర్య ఒక్కడే తమ విజయవకాశాలను దెబ్బతీసాడని చెప్పాడు. ఈ మ్యాచ్లో ఓడినా.. టీమ్గా ఎన్నో సానుకూలాంశాలు లభించాయని తెలిపాడు. వ్యక్తిగతంగా తన ప్రదర్శన సంతృప్తినిచ్చిందని చెప్పాడు.
'భారత్కు రాకముందు నేను ఫామ్లో లేను. సిరీస్ ప్రారంభమైన తర్వాతే ఫామ్ అందుకున్నాను. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. ఈ సిరీస్లో మా కుర్రాళ్లు కూడా అద్భుతమైన పోరాటం కనబర్చారు. చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. నాకు వేలి గాయం ఉండటంతోనే ఈ సిరీస్లో ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. వన్డేల్లో బౌలింగ్తోనూ రాణిస్తా. ఈ సిరీస్లో భారత్ అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైదానంలో మా ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచాలనుకున్నా. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ఎలానో నేర్చుకోవాలనుకున్నా.'అని షనక చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 నాటౌట్) సెన్సేషనల్ సెంచరీకి అండగా శుభ్మన్ గిల్(46), రాహుల్ త్రిపాఠి(35), అక్షర్ పటేల్(21 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో మదుషంక రెండు వికెట్లు తీయగా.. కసన్ రజిత, కరుణరత్నే, హసరంగా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. 16.4 ఓవర్లలో 137 పరుగులకు కుప్పకూలింది. డసన్ షనక(23), కుశాల్ మెండిస్(23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. మ్యాన్ ది మ్యాచ్ సూర్యకు దక్కగా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అక్షర్ పటేల్ అందుకున్నాడు. జనవరి 10 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్, విరాట్, బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నారు.