దేశవాళీ క్రికెట్ను ఎక్కువగా ఆడటంతోనే అంతర్జాతీయ క్రికెట్లోకి నిలకడగా రాణిస్తున్నానని న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ తెలిపాడు. డొమెస్టిక్ క్రికెట్లో పడ్డ కష్టానికి ఫలితమే ఈ వరుస సెంచరీలని చెప్పాడు. భారత్తో మూడు వన్డేల సిరీస్లో డారిల్ మిచెల్ వరుసగా 84, 131 నాటౌట్, 137 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. వరుసగా రెండు శతకాలు బాదాడు. అతని అద్వితీయమైన ప్రదర్శనతో న్యూజిలాండ్ ఈ సిరీస్ను 2-1తో గెలుచుకొని నయా చరిత్రను లిఖించింది. భారత గడ్డపై తొలి వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది.
న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన డారిల్ మిచెల్.. విల్ యంగ్, గ్లేన్ ఫిలిప్స్లతో నమోదు చేసిన భాగస్వామ్యాలు ఆఖరి మ్యాచ్లో తమ జట్టు విజయానికి ఉపయోగపడ్డాయని చెప్పాడు.
'భారత గడ్డపై సాధించిన ఈ చిరస్మరణీయమైన విజయంలో నా వంతు పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. విల్ యంగ్, గ్లేన్ ఫిలిప్స్లతో కలిసి భాగస్వామ్యాలను నెలకొల్పిన విధానం బాగుంది. ఫ్రెండ్స్తో కలిసి ఇలాంటి కీలక సమయాల్లో రాణించడం ఎప్పుడూ సంతోషాన్నిస్తుంది. నేను ఎప్పుడూ వర్తమానంలో ఉండటానికి, బంతిని జాగ్రత్తగా గమనిస్తూ ఆడటానికి ప్రయత్నిస్తాను.

గ్లేన్ ఫిలిప్స్ నాకు బెస్ట్ ఫ్రెండ్. అతను సెంచరీ సాధించడం మరో ఎండ్లో ఉండి చూడటం అద్భుతంగా అనిపించింది. అతను గాయం నుంచి కోలుకొని జట్టులోకి తిరిగి వచ్చి రాణించడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నా దేశం కోసం ఆడటాన్ని నేను ప్రేమిస్తాను. ఈ స్థాయి చేరుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే దేశవాళీ క్రికెట్ నాకు ఎంతో నేర్పింది.'అని డారిల్ మిచెల్ చెప్పుకొచ్చాడు.
ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగులతో భారత్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137), గ్లేన్ ఫిలిప్స్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 106) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/63), హర్షిత్ రాణా(3/84) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/43), కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124) శతకానికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి(57 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 53), హర్షిత్ రాణా(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాక్ ఫోక్స్(3/77), క్రిస్టియన్ క్లార్క్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. జైడెన్ లెన్నాక్స్(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ జెమీసన్కు ఒక వికెట్ దక్కింది. న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.