న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ చరిత్ర సృష్టించాడు. మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక వన్డే సిరీస్లో భారత గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఓవర్సీస్ బ్యాటర్గా నిలిచాడు. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా డారిల్ మిచెల్(131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137) ఈ ఫీట్ సాధించాడు. ఈ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో డారిల్ మిచెల్ వరుసగా.. 84, 131*, 137లతో మొత్తం 352 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో అతను 44 ఏళ్ల రికార్డ్ను బద్దలు కొట్టాడు. 1982లో శ్రీలంక బ్యాటర్ రాయ్ డయాస్ 262 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. డారిల్ మిచెల్ తాజాగా అధిగమించాడు. ఈ జాబితాలో డారిల్ మిచెల్(352) తర్వాత రాయ్ డయాస్(262), మార్లోన్ సామ్యూల్స్(254), ఆరోన్ ఫించ్(250), ఏబీ డివిలియర్స్(241) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇందులో ఆరోన్ ఫించ్, మార్లోన్ సామ్యూల్స్ ఐదు వన్డేల సిరీస్ ఆడినప్పటికే వారు మూడు మ్యాచ్ల్లోనే బరిలోకి దిగారు.
మూడు వన్డేల ద్వైపాక్షిక వన్డే సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్గా కూడా మిచెల్ నిలిచాడు. ఈ జాబితాలో బాబర్ ఆజామ్, శుభ్మన్ గిల్ 360 పరుగలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

భారత గడ్డపై భారత్కు వ్యతిరేకంగా అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్ల జాబితాలో డారిల్ మిచెల్ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు డారిల్ మిచెల్ భారత గడ్డపై భారత్కు వ్యతిరేకంగా 4 శతకాలు నమోదు చేశాడు. వరుసగా ఐదు ఇన్నింగ్స్ల్లో ఈ 4 సెంచరీలు అందుకోవడం గమనార్హం. భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాతో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ మిచెల్ రెండు శతకాలు సాధించాడు. తాజా సిరీస్లో వరుసగా మరో రెండు శతకాలు బాది ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్(5) అగ్రస్థానంలో ఉండగా.. డారిల్ మిచెల్(4), క్వింటన్ డికాక్(3), క్రిస్ గేల్(3) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఓవరాల్గా భారత్పై అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో డారిల్ మిచెల్, రికీ పాంటింగ్తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. ఏబీ డివిలియర్స్, క్రిస్ గ్రేల్(5) ముందున్నారు.
ఈ ప్రదర్శనతో డారిల్ మిచెల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి నెంబర్ వన్ ర్యాంక్ అందుకున్నాడు. కోహ్లీ, రోహిత్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137), గ్లేన్ ఫిలిప్స్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 106) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/63), హర్షిత్ రాణా(3/84) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/43), కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.