
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మార్పు వివాదం టీమిండియాపై ఏ మాత్రం ప్రభావం చూపదని, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ చేతుల్లో జట్టు సురక్షితంగా ఉందని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ అన్నాడు. ఆటగాళ్లను ప్రోత్సహించడం, వారి నుంచి అత్యుత్తమమైన ప్రదర్శన బయటకుతీయడం రోహిత్కు వెన్నతో పెట్టిన విద్య అని కొనియాడాడు. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనకు ముందు విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తూ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం భారత క్రికెట్లో పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.
సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ ఆ సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ ముందే పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ వదిలేస్తానని చెప్పాడు. దాంతో అతను పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగినట్లు అయింది. ఈ నేపథ్యంలోనే డారెన్ సామీ మాట్లాడుతూ.. ఈ పరిస్థితులన్నీ జట్టుపై ప్రభావం చూపవన్నాడు.
అలాగే కోహ్లీ కెప్టెన్గా పూర్తిగా తొలగిపోయినా బ్యాట్స్మన్గా జట్టుకు విలువైన ఆటగాడిగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. కాబట్టి జట్టు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. 'మైదానంలో కోహ్లీ తన ప్రదర్శనతో అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. మరోవైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటికే మేటి సారథిగా నిరూపించుకున్నాడు. అతనో స్ఫూర్తివంతమైన సారథి. ధోనీ, గంభీర్ లాంటి ఆటగాళ్లలా ఐపీఎల్లో తన జట్టును విజయపథంలో నడిపించాడు. వీళ్లంతా తమ ఆటగాళ్ల నుంచి సరైన ప్రదర్శన రాబట్టగలరు. వీళ్లు సహజంగానే విజయాలు సాధించి ట్రోఫీలు కైవసం చేసుకుంటారు. నేనైతే ఇప్పుడు టీమిండియా గురించి ఆందోళన చెందట్లేదు. అది ఇప్పుడు సురక్షితమైన వ్యక్తి చేతుల్లోనే ఉంది" అని డారెన్ సామి చెప్పుకొచ్చాడు.
ఇక అప్కమింగ్ భారత్ - వెస్టిండీస్ సిరీస్లపై స్పందిస్తూ డారెన్ సామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని వెస్టిండీస్కు భారత్ను ఓడించే సత్తా ఉందన్నాడు. సీనియర్ ప్లేయర్ అయిన పొలార్డ్కు భారత్లో పరిస్థితులపై మంచి అవగాహన ఉందని చెప్పుుకొచ్చాడు.