జమైకా: ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన జాతి వివక్షపై యావత్ క్రికెట్ ప్రపంచం స్పందిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత 'బ్లాక్ లైవ్స్ మాటర్స్'పేరుతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే జాతి వివక్షతకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఐసీసీ, ఇతర క్రికెట్ బోర్డులకు విజ్ఞప్తి చేసిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ.. తాజాగా ఇండియన్ ప్రీమియల్ లీగ్( ఐపీఎల్)లో తాను వర్ణ వివక్ష ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సమయంలో శ్రీలంక క్రికెటర్ తిసారా పెరిరా, తనను భారత అభిమానులు తమ శరీర రంగును ప్రస్తావిస్తూ అవహేళన చేశారని గుర్తు చేసుకున్నాడు. 2013, 2014 సీజన్లలో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన తనతో పాటు తిసారాను అభిమానులు 'కాలు' అని పిలిచేవారని, తొలుత దాని అర్థం తెలియక పట్టించుకోలేదన్నాడు. అయితే హిందీలో నల్లగా ఉన్నవారిని కాలు అని పిలుస్తారని తెలుసుకొని తీవ్ర ఆగ్రహానికి గురయ్యానన్నాడు.