
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజాపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియా జరిగిన ఫస్ట్ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడంపై కనేరియా అసంతృప్తి వ్యక్తం చేశాడు. చెత్త పిచ్ కారణంగానే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిందన్నాడు. చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు ఆస్ట్రేలియాకు రాగా.. మంచి పిచ్ను తయారు చేయడంలో పీసీబీ విఫలమైందని విమర్శించాడు. పనికిమాలిన పిచ్ తయారు చేయించిందే గాక.. ఇంకా దాన్ని సమర్థించుకోవడం ఏంటని రమీజ్ రాజాను నిలదీసాడు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రావల్పిండి వేదికగా మార్చి 4-8 మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. పేలవమైన ఈ పిచ్ ఏ సందర్భంలోనూ బౌలర్లకు అనుకూలింలేదు. దాంతో బ్యాట్స్మన్ పండుగ చేసుకున్నాడు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ అయితే రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీలు చేయగా.. అజర్ అలీ, అబ్దుల్లా షఫిక్(136 నాటౌట్) చెరో శతకం బాదారు. ఆసీస్ ఆటగాళ్లలో ఓపెనర్ ఖావాజా 97, లబుషేన్ 90 పరుగులు చేశారు. దాంతో భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.
ఈ నేపథ్యంలోనే ఈ పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పిచ్లు టెస్ట్ క్రికెట్ మనుగడకే ముప్పని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విమర్శలపై స్పందించిన పీసీబీ చీఫ్ రమీజ్ రాజా.. మ్యాచ్ పేలవ డ్రాగా ముగియడాన్ని తాను స్వాగతించడం లేదని, నాణ్యమైన పిచ్లను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఇందుకు సమయం పడుతుందని తన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.
రమీజ్ రాజా వ్యాఖ్యలపై కనేరియా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.'రమీజ్ రాజా పాక్ అభిమానులకు ద్రోహం చేశాడు. వెన్నుపోటు పొడిచాడు. ఆయన తన కుమారుడి పెళ్లి పనులతో బిజీగా ఉన్నాడేమో. ఇప్పుడు మాత్రం ఈ జీవం లేని వికెట్ గురించి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఇక్కడికి వచ్చింది. కానీ.. మీరు.. ఇలాంటి చెత్త పిచ్ రూపొందించారు. బౌలర్లు రాణిస్తే చూడటం ఇష్టం లేదా? మీ కెప్టెన్ ఒక అసమర్థుడు. దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతున్నాడు. ఇది ఎలాంటి పిచ్ అంటే రమీజ్ రాజా ఈ వయసులో కూడా అక్కడ పరుగుల వరద పారించగలడు'' అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.