
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ను బహిష్కరించే దమ్ము పాకిస్థాన్కు లేదని ఆ జట్టు మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయాన్ని అంగీకరించడం తప్పా పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి మరో మార్గం లేదన్నాడు. ఇక
వచ్చే ఏడాది పాకిస్థాన్లో కాకుండా తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 నిర్వహిస్తామని ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. పాకిస్థాన్లో భారత జట్టు పర్యటించదని జై షా చెప్పడం పాకిస్థాన్ క్రికెట్ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది.
ఈ అంశంపై పీసీబీ సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్కు కౌంటర్గా వన్డే ప్రపంచకప్ 2023 సహా ఏసీసీ కౌన్సిల్ నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. తాజాగా ఈ అంశంపై పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. పాక్ అన్నంత పని చేయలేదని, భారత్ నిర్ణయాన్ని ఆమోదించడం తప్ప పీసీబీకి మరో దారి లేదని తెలిపాడు. 'బీసీసీఐ నిర్ణయం సరైందే కావచ్చు. ఐసీసీకి 90 శాతం నిధులు వారి నుంచే అందుతుండవచ్చు. అందులో పాక్కు ఎలాంటి అభ్యంతరం లేదు. పీసీబీ ఈ నిర్ణయాన్ని అంగీకరించలేకపోయినా మిగిలిన దేశాలైనా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి దేశాల మద్దతు భారత్కే ఉంటుంది. ఎందుకంటే.. బీసీసీఐ ఎంత శక్తిమంతమైందో వారికి తెలుసు.
బీసీసీఐ నిర్ణయం ఏదైనా అంగీకరించాల్సిందే. అందులో తప్పేమీ లేదు. ఇరు దేశాల మధ్య రాజకీయపరమైన పరిస్థితులు అలా ఉన్నాయి. పాక్లో పర్యటించడానికి అక్కడి బోర్డుకు అనుమతులు లభించకపోవచ్చు. ఈ సమస్యను ఇరు దేశాల బోర్డులు, దౌత్యవేత్తలు కలిసి పరిష్కరించుకోవాలి. వచ్చే ఏడాది వన్డే ప్రంచకప్ సిరీస్ నుంచి తమ దేశం వైదొలగాలని కొందరు సూచించారు. కానీ పాక్ అలా చేయలేదు. బీసీసీఐ నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప దానికి వేరే మార్గం లేదు. కానీ భారత్ తలుచుకుంటే పాక్తో ఐసీసీ ఈవెంట్లను సైతం రద్దు చేసుకోగలదు. రేపు అఫ్గానిస్థాన్ కూడా మా దేశంలో ఆడటానికి అంగీకరించకపోవచ్చేమో'అని కనేరియా వ్యాఖ్యానించాడు. షాహిద్ అఫ్రిది సైతం ఈ వ్యవహారంపై ట్విటర్ వేదికగా స్పందించాడు. బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్లో అనుభవలేమి కనిపిస్తోందని విమర్శించాడు.