భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కంటే ఇరు జట్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే ఎక్కువ చర్చనీయాంశమవుతున్నాయి. ఆసియా కప్ 2025 టోర్నీలో రెండు సార్లు చిత్తుగా ఓడినా.. పాకిస్థాన్ ఆటగాళ్లకు బుద్ది రాలేదు. తొలి మ్యాచ్ అనంతరం క్రీడా స్ఫూర్తి అంటూ ఉపన్యాసాలు ఇచ్చిన పాకిస్థాన్.. తాజా మ్యాచ్లో మాత్రం హింసాత్మక ప్రవృత్తికి అద్దం పట్టేలా ప్రవర్తించింది.
పదే పదే భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం భారత్పైకి ఏకే47 గన్ను ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. ఈ సెలెబ్రేషన్స్ను చూసి క్రికెట్ లోకం నివ్వెరపోయింది. మ్యాచ్ అనంతరం తన చేష్టలను ఫర్హాన్ సమర్థించుకున్నాడు. తనకు నచ్చినట్లు సెలెబ్రేట్ చేసుకుంటానని, ఎవరు ఏమనుకున్నా తనకు అనవసరమని వ్యాఖ్యానించాడు. అయితే ఈ చర్యను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఖండించాడు. ఫర్హాన్ ఏకే 47 ఎక్కుపెడితే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ మిసైల్ను ప్రయోగించారని తెలిపాడు.

'పాక్ ఓపెనర్ ఫర్హాన్ ఏకే -47 ఎక్కుపెట్టి కాల్చినట్లుగా సంబరాలు చేసుకున్నాడు. కానీ, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ వారి విధ్వంసకర బ్యాటింగ్తో పాక్పై ఏకంగా బ్రహ్మోస్ మిస్సైల్స్ను ప్రయోగించారు. అభిషేక్ శర్మ అదనంగా ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. టీమిండియా ఓపెనర్ల విధ్వంసానికి పాకిస్థాన్ చేతులెత్తేసింది. పాక్ చర్యకు.. భారత్ ప్రతిచర్య భారీ స్థాయిలో ఉంది.
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ లాంటి విధ్వంసకర ఓపెనర్లు జట్టులో ఉంటే 200 పరుగుల లక్ష్యం కూడా చిన్నబోతుంది. వారి నైపుణ్యం, క్లాస్ బ్యాటింగ్ అద్భుతం. ఓటమి నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు మరో వివాదం కోసం చూస్తుంది. ఫకర్ జమాన్ ఔట్ కాదని వాదిస్తుంది. కానీ.. అది కచ్చితంగా ఔటే. సంజూ శాంసన్ అద్భుతంగా అందుకున్నాడు. అతని గ్లౌజులు బంతి కిందనే ఉన్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం బెన్ఫిట్ ఆఫ్ డౌట్ ప్రకారం నాటౌట్ అని వాదిస్తోంది.'అని కనేరియా విమర్శలు గుప్పించాడు.