న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ను బహిష్కరించే సీన్ పాకిస్థాన్కు లేదని ఆ జట్టు మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అన్నాడు. అలా చేయడం పాకిస్థాన్కే నష్టమని, భారత్ తలుచుకుంటే ఏమైనా చేయగలదని అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఆసియాకప్ టోర్నీలో టీమిండియా ఆడకపోతే.. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ ఆడమని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కాగా.. ఈ బెదరింపులకు భయపడేది లేదని, ఏ దేశం కూడా భారత్ను శాసించలేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన డానిష్ కనేరియా రమీజ్ రాజా వ్యాఖ్యలు తప్పుబట్టాడు. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల నుంచి వైదొలిగే దమ్ము పాక్కు లేదని విమర్శించాడు. వన్డే ప్రపంచకప్ను పాకిస్థాన్ బహిష్కరించడం వల్ల టీమిండియాకు జరిగే నష్టం ఏం లేదన్నాడు. భారత్ తలుచుకుంటే ఆసియా కప్ వేదికనే మార్చగలదని హెచ్చరించాడు. ఆసియాకప్ను భారత్ బహిష్కరిస్తే అఫ్గాన్, బంగ్లాదేశ్లు కూడా తప్పుకుంటాయని తెలిపాడు.
'ఐసీసీ మెగా టోర్నీలో పాక్ పాల్గొనకుండా ఉండే దమ్ము లేదు. ఒక వేళ అలా చేసినా పాక్కే నష్టం తప్ప.. భారత్కు కాదు. వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ ఆడినా, ఆడకపోయినా బీసీసీఐ పట్టించుకోదు. వారికి చాలా భారీ మార్కెట్ ఉంది. రెవెన్యూ కూడా అదే స్థాయిలో ఉంటుంది. వన్డే ప్రపంచకప్ కోసం భారత్లో పర్యటించకపోతే పాక్ నష్టపోవాల్సి వస్తుంది.
ఐసీసీ నుంచి ఒత్తిడి ఉంటే తప్పకుండా పాక్ ఆడాల్సిందేనని అధికారులు చెప్పే అవకాశం లేకపోలేదు. పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిని బట్టి రమీజ్ రాజా ఇలాంటి ప్రకటనలు చేయడం సరైంది కాదు. ఆసియా కప్ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఇలానే చేస్తే బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ కూడా బాయ్కాట్ చేసే ప్రమాదం లేకపోలేదు. అప్పటికి పరిస్థితుల్లో మార్పులు వచ్చి ఏమైనా జరగవచ్చు'అని కనేరియా చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్థాన్ లేని వన్డే ప్రపంచకప్ను ఎవరు చూస్తారని రమీజ్ రాజా ప్రశ్నించాడు. ఏడాదిలోనే మిలియన్ డాలర్ల టీమ్ అయిన భారత్ను రెండు సార్లు ఓడించామని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్పై భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు ఘాటుగా స్పందించారు.