
కరాచీ: ప్రస్తుత బౌలింగ్ లైనప్తో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవలేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) అన్నాడు. టీమిండియా వెంటనే తమ బౌలింగ్ లైనప్ను మార్చాలని, యువ పేసర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, టీ నటరాజన్లకు అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండగా.. ఇప్పటికే జట్లన్నీ తమ సన్నాహకాలు ప్రారంభించాయి.
సొంతగడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్ను చిత్తు చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియా చేతిలో మాత్రం ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన డానిష్ కనేరియా.. టీమిండియా బౌలింగ్ లైనప్ చాలా బలహీనంగా ఉందన్నాడు. ఈ బౌలింగ్ అటాక్తో మెగా టోర్నీ ఆడితే టీమిండియా కనీసం నాకౌట్ కూడా చేరదని హెచ్చరించాడు.
'భారత్ దగ్గర ప్రస్తుతం పేలవ బౌలింగ్ లైనప్ ఉంది. ప్రపంచకప్ కోసం టీమిండియాకు మెరుగైన బౌలర్లు కావాలి. ప్రస్తుత బౌలర్లతో టీమిండియా ప్రపంచకప్ గెలవలేదు. ఇలా చెప్తున్నందుకు భారత అభిమానులు నన్ను క్షమించాలి. కానీ ఇది వాస్తవం. ప్రస్తుత బౌలింగ్ అటాక్తో టీమిండియా నాకౌట్ కూడా చేరలేదు. జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడనేదానిపై ఎలాంటి స్పష్టత లేదు. కాబట్టి టీమిండియా యువ పేసర్లు అయిన ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, టీ నటరాజన్లకు అవకాశం ఇవ్వాలి.'అని డానిష్ కనేరియా సూచించాడు.

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్కు తడబడ్డారని చెప్పాడు. బంతి బాగా టర్న్ అయితే భారత బ్యాటర్లు ఆడలేరని వివరించాడు. దానికి ప్రధాన కారణం క్విక్ డెలివరీ వేసే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ను నెట్స్లో ప్రాక్టీస్ చేయడమేనని చెప్పుకొచ్చాడు. 'భారత బ్యాటర్లు స్పిన్ బాగా ఆడుతారని ఎప్పుడూ చెబుతారు. ప్రాక్టీస్లో భారత బ్యాటర్లు ఎప్పుడూ క్విక్ డెలివరీలు వేసే జడేజా, చాహల్, అక్షర్ పటేల్ బౌలింగ్ను మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఆసీస్ స్పిన్నర్లు బంతిని బాగా టర్న్ చేయడంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.'అని కనేరియా చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడి సిరీస్ను 2-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ 2023 కోసం ఆటగాళ్లంతా సిద్దమవుతుండగా.. ధనాధన్ లీగ్ మార్చి 31న ప్రారంభం కానుంది.